బంగారం కొనుగోళ్ళకు దూరం దూరం... ఎందుకో తెలుసా?
బంగారమంటే భారతీయులందరికీ ప్రియమే. సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడికి ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. మహిళల అందాన్ని, హోదాను పెంచే పెంచే బంగారం పెట్టుబడి దారులకు సిరులు కురిపిస్తుంది. 130 కోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశంలో పసిడి గిరాకీకి కొదువలేదు. పండగల సందర్భంలో బంగారం దుకాణాలు కస్టమర్లతో కళకళ లాడిపోతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితిలో మార్పువచ్చింది. బంగారం వినియోగంలో భారత్ వెనుకడుగు వేస్తోంది. ఇందుకు పలు అంశాలు కారణమవుతున్నాయి. అవేమిటంటే..
57ఏళ్లలో తీవ్ర ఒడిదుడుకుల్లో చైనా, గుడ్డులా పగిలిపోయింది
32 శాతం తగ్గుదల
ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికం వరకు చూసుకుంటే దేశీయంగా బంగారం వినియోగదారు డిమాండ్ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఏకంగా 32 శాతం తగ్గి 124 టన్నులకు చేరుకుంది. గత 13త్రైమాసికాల్లో అంటే 39 నెలల్లో ఇదే తక్కువ. అంటే దీన్ని బట్టి బంగారం డిమాండ్ ఏ స్థాయిలో తగ్గిందో తెలుసుకోవచ్చు.
ఎందుకు తగ్గిందంటే...
* బంగారం డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ధర. ఈ మధ్య కాలంలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పసిడి కొనుగోళ్ళకు వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో మందగమనం కారణంగా కూడా వినియోగదారులు బంగారంపై ఆసక్తి చూపడంలేదు. బంగారం వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. దీనివల్ల ధర మరింతగా పెరిగింది.
* వ్యవసాయ రంగంలో రైతులకు ఆశించిన స్థాయిలో ఆదాయాలు రావడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కూడా తక్కువ కాలం ఉంది. ఈ పరిణామాలు బంగారం డిమాండ్ ను ప్రభావితం చేశాయి.
* జూన్ లో 10 గ్రాముల బంగారం ధర 34,000 రూపాయల స్థాయిలో ఉంటే సెప్టెంబర్ లో 39,000కు చేరుకుంది. ధరల పెరుగుదల డిమాండును దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
* ఇంతకు ముందు మన దేశంలో ఎక్కువ మంది బంగారం కడ్డీలు, కాయిన్లు కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చైనా మనకన్నా ఎక్కువగా బంగారం కడ్డీలు, కాయిన్లు కొనుగోలు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగాను...
బంగారానికి గిరాకీ ఒక్క మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగాను తగ్గుతోంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల డిమాండ్ 28 శాతం తగ్గి 611 టన్నులకు చేరుకుంది. చైనాలో డిమాండ్ ఏకంగా 25 శాతం తగ్గింది.
మనకన్నా ముందు చైనా...
బంగారానికి నియోగదారుల డిమాండ్ విషయంలో చైనా మనకన్నా ముందుంటోంది. 2013 నుంచి చైనాలోనే బంగారానికి ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ సంవత్సరంలో భారత్ లో బంగారం డిమాండ్ 958 టన్నులు ఉంటే చైనాలో 1,345 టన్నులుగా ఉంది. ఈ ఏడాది వరకు కూడా భారత్ కన్నా చైనానే ముందుంటోంది.
ఈ ఏడాదిలో సెప్టెంబర్ వరకు మన దేశంలో బంగారానికి డిమాండ్ 496 టన్నులు ఉంటే చైనాలో 639 టన్నులు ఉంది. బంగారం వినియోగంలో భారత్ ముందుండేది. కానీ చైనా ఆ స్థానాన్ని ఆక్రమించింది. మనదేశంలో బంగారం కొనుగోళ్ల విషయంలో కొన్ని రకాల ఆంక్షలు విధించడం, అధిక ధరలు తదితర అంశాలు బంగారం డిమాండ్ ను ప్రభావితం చేస్తున్నాయి.
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో చైనాలో వినియోగదారు డిమాండ్ భారత్ కన్నా 61 శాతం అధికంగా ఉంది. ఈ దేశంలో డిమాండ్ 25 శాతం తగ్గి 199 టన్నులకు చేరుకున్నప్పటికీ మనదేశంకన్నా డిమాండ్ ఎక్కువే ఉంది.