ఏడాదిన్నరగా పెళ్లిళ్లు వాయిదా, పండుగ ఎఫెక్ట్: బంగారం ఇంపోర్ట్స్ 3 రెట్లు జంప్!
బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. నవంబర్ నెలలో పండుగలు, పెళ్ళిళ్లు వంటి శుభముహూర్తాల నేపథ్యంలో పసిడి వినియోగం పెరిగింది. దీంతో బంగారం దిగుమతులు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా తర్వాత డెల్టా వేరియంట్ ప్రభావం కాస్త కనిపించింది. అయితే నవంబర్ నెలలో ఆర్థిక రికవరి కనిపించడంతో పాటు చివరి వారంలో పుట్టుకువచ్చిన ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అని వెల్లడైంది. కరోనా ప్రభావం తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడంవంటి అంశాలకు ముహూర్తాలు, పండుగలు వంటివి తోడవడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి.
వైరస్ నియంత్రణ నేపథ్యంలో ముహూర్తాలు కలిసి రావడంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. నవంబర్ మిడ్ నుండి 2.5 మిలియన్ల వేడుకలు జరిగినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో అంచనాల్లో ఈ వాటానే దాదాపు నాలుగో వంతు. ప్రభుత్వం కరోనా మినహాయింపులతో వేడుకలు పెరిగాయి.
పండుగ కలిసి వచ్చింది
2019లో మందగమనం, 2020లో కరోనా నేపథ్యంలో భారత జ్యువెల్లరీ వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. రెండేళ్లుగా డిమాండ్ దెబ్బతిన్న జ్యువెల్లరీ రంగానికి నవంబర్ నెలలో పుంజుకోవడం భారీ ఊరట. బంగారాన్ని కొనుగోలు చేయడం, బహుమతిగా ఇవ్వడం భారత్లో సాధారణ విషయం. అలాంటిది కరోనా కారణంగా బంగారం కొనుగోళ్లు రెండేళ్లుగా పడిపోయాయి. దీనికి తోడు కరోనా సమయంలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో కొనుగోలుకు సామాన్యులు వెనుకడుగు వేశారు. ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి.
దీపావళి సమయంలో బంగారం కొనుగోళ్లు రికార్డ్ స్థాయిలో ఉంటాయి. ఈ పండుగ సీజన్ కారణంగా ఈ ఏడాది బంగారం దిగుమతులు 900 టన్నులకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, గత ఆరేళ్ల కాలంలో ఇదే అత్యధికమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది కరోనా సమయంలో దిగుమతులు 350 టన్నులు మాత్రమే. అంటే గత ఏడాది 350 టన్నుల నుండి ఈ ఏడాది 900 టన్నులు ఉండవచ్చు అంటే దాదాపు మూడు రెట్లు.
ఆల్ టైమ్ గరిష్టంతో తక్కువే
గత ఏడాది (2020) ఆగస్ట్ నెలలో బంగారం దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200ను తాకింది. రిటైల్ మార్కెట్లో రూ.59,000కు చేరువైంది. అయితే కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఫ్యూచర్ మార్కెట్లో ప్రస్తుతం రూ.48,000 నుండి రూ.49,000 మధ్య ఉంది. రిటైల్ మార్కెట్లో రూ.50,000కు పైన ఉంది. అయితే నవంబర్ నెలలో ధరలు ఇంతకంటే తక్కువగానే ఉన్నాయి. గతంలో ఓ సమయంలో ఫ్యూచర్ మార్కెట్లో రూ.44,000 దిగువకు కూడా పడిపోయాయి.
అయితే చాన్నాళ్లుగా రూ.46,000 నుండి రూ.50000 మధ్య కదలాడుతోంది. దీంతో ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే ధరలు కాస్త తగ్గడం, శుభకార్యాలు తోడవడంతో కొనుగోళ్లు పెరిగాయి. గత ఏడాదిన్నరగా బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు.
పెళ్లిళ్లు వాయిదా.. ఇప్పుడు జోరు
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు భారత్. దాదాపు మొత్తం బంగారం దిగుమతి అవుతోంది. ప్రతి సంవత్సరం పండుగ సీజన్ అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో ధరలు గరిష్టస్థాయికి చేరుకుంటాయి. వివిధ కారణాలతో ప్రస్తుత ఏడాది సేల్స్ దశాబ్దంలోనే అత్యధికంగా ఉండవచ్చునని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది.
కరోనా కారణంగా ఏడాదిన్నరగా వివాహాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కరోనా నిబంధనలు సడలించడంతో కొద్ది రోజులుగా పెళ్లిళ్లు పెరిగాయి. మరోసారి ఒమిక్రాన్ భయాలు పెరుగుతున్నాయి. మున్ముందు కూడా బంగారం బుల్లిష్గా ఉంటుందని జ్యువెల్లరీ వ్యాపారులు గట్టి నమ్మకంతో ఉన్నారు.