ఏడేళ్ల గరిష్టానికి, చమురు ధరల ఎఫెక్ట్: మార్కెట్లు భారీ పతనం
స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 18, 2022) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం గం.2.30 వరకు స్వల్ప నష్టాల మధ్య ఊగిసలాడాయి. సెన్సెక్స్ ఉదయం గం.10.30 సమయానికి 60,100 దిగువకు పడిపోయింది. ఆ తర్వాత నష్టాల్లోనే ఉన్నప్పటికీ కాస్త కోలుకున్నట్లుగా కనిపించింది. కానీ మధ్యాహ్నం గం.2.30 తర్వాత భారీ పతనం కనిపించింది. చివరి గంటలో అంతకంతకూ క్షీణించి చివరకు 600 పాయింట్లకు పైగా పడిపోయింది. చివరకు 554 పాయింట్ల నష్టాలతో మార్కెట్ ముగిసింది. కొద్ది రోజులుగా మార్కెట్లు లాభాల్లో కనిపిస్తున్నాయి. టెలికం, ఆటో, రియాల్టీ, మెటల్, ఐటీ, ఇన్ఫ్రా రంగాలు నేడు కుదేలవడం నష్టాలకు కారణమైంది. దీంతో సెన్సెక్స్ 61,000 పాయింట్ల మార్కు దిగువన ముగిసింది.
సెన్సెక్స్ 61,430.77 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,475.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,662.57 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,337.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,350.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,085.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 554.05 (0.90%) పాయింట్లు నష్టపోయి 60,754.86 పాయింట్ల వద్ద, నిఫ్టీ 195.05 (1.07%) పాయింట్లు క్షీణించి 18,113.05 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కొటక్ మహీంద్రా ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, మారుతీ సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, ఐచర్ మోటార్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, HDFC బ్యాంకు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు నేడు సూచీలపై ప్రభావం చూపాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ఆసియా మార్కెట్లు సమయం గడిచిన కొద్ది పతనమయ్యాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ సంకేతాలతో దేశీయ సూచీలు అదే బాటలో పయనించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు నిన్న రాణించినప్పటికీ, నేడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపారు. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏడేళ్ల గరిష్టానికి 87 డాలర్లకు చేరుకోవడం భారీ ప్రభావం చూపింది.