బలహీనమైన డీజిల్ డిమాండ్, పారిశ్రామిక రికవరీ మందగమనం
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు డిమాండ్ కూడా క్రమంగా కరోనా ముందుస్థాయికి చేరుకుంటోంది. పెట్రోల్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, డీజిల్ డిమాండ్ మాత్రం బలహీనంగానే ఉంది. పారిశ్రామిక రికవరీ ఏ మేరకు ఉందో తెలియాలంటే డీజిల్ డిమాండ్ కూడా కీలకమైన అంశమే. సాధారణంగా భారత చమురు డిమాండ్లో 40 శాతం డీజిల్దే. అయితే లాక్ డౌన్ తర్వాత నుండి డీజిల్కు డిమాండ్ తగ్గింది. రికవరీ కూడా మందగించింది.
Budget 2021: కరోనా, చైనా... 'ఆత్మనిర్భర్ భారత్'కు రెండు కీలక సవాళ్లు
రికవరీ.. డీజిల్ ప్రభావం
డీజిల్ వినియోగం వార్షిక వృద్ధి ప్రాతిపదికన మార్చి 2022 వరకు కరోనా ముందుస్థాయికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ చైర్మన్ కుమార్ సురనానా అన్నారు. సాధారణంగా డీజిల్ను ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగం, వ్యవసాయ రంగంతో పాటు ట్రక్, బస్సుల్లో వినియోగిస్తారు. అయితే డీజిల్ వినియోగం లెక్కలతో ఆర్థిక కార్యకలాపాల వేగవంతాన్ని అర్థం చేసుకోవచ్చు. డీజిల్ డిమాండ్ లేమి నేపథ్యంలో ఆర్థిక రికవరీ ఇప్పటికీ కష్టపడుతున్నట్లుగా చెప్పవచ్చునని అంటున్నారు.
సగటు కంటే 5 శాతం తక్కువ
డీజిల్ డిమాండ్ రికవరీ గ్యాసోలీన్ కంటే వెనుకబడి ఉంది. 2021 మొదటి అర్ధ సంవత్సరంలోను ఇదే ఒరవడి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ కన్సల్టెంట్ ఎఫ్జీఈ సౌత్ ఏషియా ఆయిల్ హెడ్ సెంథిల్ కుమారన్ అన్నారు. డీజిల్ డిమాండ్ రాబోయే నెలల్లో సగటు కంటే 5 శాతం తక్కువగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
సేల్స్ పడిపోయాయి
జనవరి మొదటి రెండు వారాల్లో ఇంధన సేల్స్ పడిపోయాయని, అందులోను డీజిల్ డిమాండ్ ఎక్కువ తగ్గుదలను నమోదు చేసిందని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రైతు నిరసనల ప్రభావం కూడా ఉందని అంటున్నారు. వినియోగం మందగించడానికి ఇది కూడా ఓ కారణం. అలాగే, రికార్డు స్థాయిలో ఇంధన ధరలు డిమాండును తగ్గించినట్లు చెబుతున్నారు.