హైదరాబాద్ ప్లాంట్ కంటే డబుల్ సామర్థ్యంతో ఏపీలో వోల్టీ పెట్టుబడి
ప్రముఖ వాహన ట్రాకింగ్ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్లో రూ.50 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఏపీలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. మంగళగిరి వద్ద ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ కోసం ఇప్పటికే భూమిని కొనుగోలు చేశామని, ఈ ప్లాంటులో ప్రతి రోజు 2వేల పరికరాలు ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో తెలిపారు.
అమరావతికి రూ.1 లక్షకోట్లు: ప్రభుత్వానికి భారంగా రాజధాని.. జగన్ రివర్స్ ప్లాన్!
400 నుంచి 500 మందికి ఉపాధి
ప్రతి రోజు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటులో 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ పేర్కొన్నారు. కొత్త ప్లాంటులో ఏఐఎస్ 140 ప్రమాణాలు గల జీపీఎస్ పరికరాలను రూపొందిస్తామని, ఈ కేంద్రం ద్వారా 400 నుంచి 500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ ప్లాంటు కోసం వచ్చే ఏడాది మే నాటికి రూ.35 కోట్లు సమీకరించనున్నట్లు చెప్పారు.
ప్లాంట్ సామర్థ్యం రెండింతలు
హైదరాబాద్ ప్లాంటు సామర్థ్యం రోజుకు 1,000 యూనిట్లుగా ఉందని చెప్పారు. ఏపీలో 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని బాలానగర్ వద్ద రూ.6 కోట్లతో గత ఏడాది ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. ప్రతి రోజుకు వెయ్యి యూనిట్ల ఉత్పత్తి అవుతుండగా దేశ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండును దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్ సామర్థ్యాన్ని మరో 50 శాతం పెంచుతున్నట్లు చెప్పారు. మూడేళ్లలో ఈ సామర్థ్యాన్ని 3వేల కోట్ల యూనిట్లకు పెంచనున్నారు.
పరికరాలకు డిమాండ్
కాగా, నవంబర్ 26వ తేదీ నుంచి ఏపీలో ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాక్టర్లను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేశారు. 25వేల వాహనాల దాకా ఇసుక రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ కోణార్క్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏఐఎస్ 140 ధ్రవీకరణ పొందిన ఏకైక కంపెనీ తమదేనని, ఏపీలో ఉన్న డిమాండుకు ఈ ప్లాంటు కలిసి వస్తుందని చెప్పారు. భారత్తో సహా వివిధ దేశాల్లో ఇప్పటికే 2 లక్షలకు పైగా పరికరాలను విక్రయించామని, ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ట్రాక్టర్ల వినియోగం పెరుగుతోందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు పైగా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్యన 70వేలు విక్రయించామన్నారు.