Microsoft: ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. ఆర్థిక అనిశ్చితిలో ముందస్తు చర్యలు.. రానున్న కాలంలో..
Microsoft: కరోనా తరువాత భారతదేశంలోని అనేక టెక్ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. పైగా ఉద్యోగుల వలసల కారణంగా ఫ్రెషర్లను కూడా కంపెనీలు భారీ స్ఖాయిలో రిక్రూట్ మెంట్లు చేసుకుంటున్నాయి. కానీ.. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మాత్రం పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి మధ్య ఉద్యోగులను తొలగించింది. మాంద్యం కారణంగా ముందుగా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ నిలిచింది.
కంపెనీ ప్రయోజనాలకోసమే..
టెక్ దిగ్గజం తన కార్యాలయాలు, ఉత్పత్తి విభాగాల్లో మెుత్తంగా 1,80,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 1% మందిని తొలగించింది. అంటే 1,800 మంది వరకు ఉద్యోగులను కంపెనీ ప్రస్తుతం తొలగించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు తక్కువగానే ఉందని, అన్ని కంపెనీలు లాగానే వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్మాణాత్మక సర్దుబాట్లు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కంపెనీ పెట్టుబడులు కొనసాగుతాయని, రానున్న సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఏఏ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి..
మైక్రోసాఫ్ట్ Q3లో బలమైన ఆదాయాలను నివేదించింది. క్లౌడ్ రాబడిలో 26% పెరుగుదల వల్ల మొత్తం ఆదాయం 49.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జూన్ ప్రారంభంలో టెక్ దిగ్గజం దాని Q4 రాబడి అంచనాలను ఫారెక్స్ హెచ్చుతగ్గుల వల్ల తగ్గించుకుంది. అమెరికా ఆటో దిగ్గజం టెస్లా సైతం 200 మంది ఉద్యోగులను తొలగించింది. Twitter దాని రిక్రూటింగ్ టీమ్లో 30% మందికి ఉద్వాసన పలికింది.
కొత్త నియామకాల నిలిపివేత..
ఇదే క్రమంలో.. అమెరికాలోని టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, స్నాప్, ఎన్విడియా, ఉబెర్, ఇంటెల్, సేల్స్ఫోర్స్ వంటి అనేక పాతుకుపోయిన సాంకేతిక సంస్థలు ఇటీవల కొత్త నియామకాలను తాక్కాలికంగా నిలిపివేశాయి. పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం, ప్రతిష్టంభన భయాలను రేకెత్తించడంతో టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. దీనికి తోడు కొత్త పెట్టుబడి ఆలోచనలను సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి.