ట్రేడ్ వార్: చైనా కీలక కంపెనీలు అమెరికా బ్లాక్ లిస్ట్లో: ఆ దమనకాండ కొనసాగితే..మరిన్ని
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య మరోసారి వాణిజ్యపరమైన యుద్ధం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడానికి కారణమైన చైనాను ఇరుకున పెట్టడానికి సామాజికాంశాలను అమెరికా తెరమీదికి తీసుకొచ్చింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాన్నే జో బిడెన్ సారథ్యంలోని ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఇదివరకు కొన్ని చైనా కంపెనీలను ట్రంప్ ప్రభుత్వం బ్లాక్లిస్ట్లో పెట్టగా.. బిడెన్ సర్కార్..దాన్ని మరింత విస్తృతం చేసింది.
తాజాగా- మరో 14 చైనా కంపెనీలను అమెరికా తన బ్లాక్లిస్ట్లోకి చేర్చింది. వాటిని నిషేధిత కంపెనీల పరిధిలకి తీసుకొచ్చింది. బిడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం- ఉయ్ఘుర్ ముస్లిమ్స్. గ్ఝిన్జియాంగ్ ప్రావిన్స్లోని ఉయ్ఘుర్ ప్రాంతంలో నివసించే ముస్లిమ్స్పై చైనా ప్రభుత్వం దమనకాండను సాగిస్తోందన విషయాన్ని కారణంగా చూపుతూ ఆ దేశానికి చెందిన 14 కంపెనీలను బ్లాక్లిస్ట్లోకి చేర్చింది అమెరికా.
ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఉయ్ఘుర్ ముస్లిములు, కజకిస్తానీయులు, ఇతర సామాజిక వర్గంపై మాస్ డిటెన్షన్, హై టెక్నాలజీ సర్వైలెన్స్తో నిఘా ఉంచిందని, ఆ ప్రాంతంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని అమెరికా చెబుతోంది. ఈ ఆరోపణలను చైనా ప్రభుత్వం తోసిపుచ్చింది.
చైనా అకాడమీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్ఝిన్జియాంగ్ లియాన్హై ఛువాంగ్ఝీ ఐటీ కంపెనీ, షెన్జెన్ కాబర్ ఐటీ కంపెనీ, గ్ఝిన్జియాంగ్ సెయిలింగ్ ఐటీ, బీజింగ్ గీలింగ్ షెన్టాంగ్ ఐటీ, చెంగ్డు గ్ఝివు సెక్యూరిటీ సిస్టమ్ అలయన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి కంపెనీలు తాజా నిషేధ జాబితాలో ఉన్నాయి. అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా స్పందించింది. తమ దేశ కంపెనీల హక్కులను పరిరక్షించడంపై తాము దృష్టి సారిస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకున్నట్టు భావిస్తున్నామని, ఇది సరికాదని వ్యాఖ్యానించారు.