LIC పాలసీ హోల్డర్లకు గుడ్న్యూస్, IPOలో 10 శాతం రిజర్వ్
న్యూఢిల్లీ: LIC ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదార్లకు కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం నాడు తెలిపారు. పాలసీదారుల ప్రయోజనాల దృష్ట్యా మెజారిటీ వాటాదారుగా ప్రభుత్వం కొనసాగుతుందని, నియంత్రిత వాటాను అట్టిపెట్టుకుంటుందని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో LIC ఐపీవో రానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫైనాన్స్ బిల్లులో LIC సవరణ చట్టాన్ని పొందుపరచడంతో త్వరలో చట్టసభల ఆమోదానికి రానుంది. LIC ఐపీఓ సలహాదారులుగా డెలాయిట్, ఎస్బీఐ క్యాప్స్ ఉన్నాయి.
FASTag: ఇది గుర్తుకు ఉందా, ఫిబ్రవరి 15 నుండి తప్పనిసరి
వాటాలు విక్రయించినప్పటికీ...
ఫైనాన్స్ బిల్లు 2021-22లో ఎల్ఐసీ జీవిత బీమా పాలసీదారులకు అనుకూలంగా ఇష్యూ పరిమాణంలో 10 శాతం వరకు పోటీ ప్రాతిపదిక రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఎల్ఐసీ చట్టంలో తగిన సవరణలు చేయనున్నారు. దాదాపు 27 సవరణలను ఫైనాన్స్ బిల్లులో చేర్చారు. ప్రస్తుతం ఎల్ఐసీలో 100 శాతం వాటా కేంద్రానిదే. అయితే వాటాలు విక్రయించినప్పటికీ మెజార్టీ వాటా, నియంత్రణ అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉండనుంది.
మార్కెట్ వ్యాల్యూ
LIC మార్కెట్ వ్యాల్యూను లెక్కించే బాధ్యతను మిల్లిమాన్ అడ్వైజర్స్కు అప్పగించారు. . ప్రీ-ఐపీఓ ట్రాన్సాక్షన్ సలహాదారులుగా డెలాయిట్, ఎస్బీఐ క్యాప్లను నియమించారు. 2021-22లో ప్రభుత్వరంగ కంపెనీల నుండి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.లక్ష కోట్లు, PSUల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.75,000 కోట్లు సమకూరుతుందని అంచనా.
అంచనాలు
LIC మార్కెట్ వ్యాల్యూ అంచనా కనిష్టంగా రూ.8 లక్షల కోట్ల నుండి రూ.10 లక్షల కోట్లు, గరిష్టంగా రూ.12.5 లక్షల కోట్ల నుండి రూ.15 లక్షల కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ఐపీవోలో భాగంగా విక్రయించేందుకు అవకాశమున్న వాటా 5 శాతం నుండి 10 శాతం. ఈ ఏడాది దీపావళి సమయానికి ఎల్ఐసీ ఐపీవో రావొచ్చు. దేశ చరిత్రలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఇదే కావొచ్చునని మార్కెట్ వర్గాల అంచనా. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎల్ఐసీ అత్యంత విలువైన కంపెనీగా అవతరించవచ్చు.