మాన్సూన్ టూరిజం: పర్యాటకానికి బూస్ట్: కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభం
ముంబై: కరోనా వైరస్ వల్ల దారుణంగా దెబ్బతిన్న పర్యాటక రంగానికి మళ్లీ గాడిన పెట్టడానికి కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రంగంలోకి దిగాయి. అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే కోస్తా తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా- తీర ప్రాంత జిల్లా సింధుదుర్గ్లో నిర్మించిన విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సూక్ష్య, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణె, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు.
సింధుదుర్గ్ జిల్లాలో పెద్ద ఎత్తున పశ్చిమ కనుమలు విస్తరించి ఉంటాయి. గోవాకు దగ్గరగా ఉండే జిల్లా ఇది. వర్షాకాలం, చలి కాలంలో పశ్చిమ కనుమలు వర్ణించడానికి వీల్లేనంతగా పచ్చదనాన్ని పరచుకుని ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ రెండు కాలాల్లోనూ పెద్ద ఎత్తున పర్యాటకులు సింధుదుర్గ్, పరిసర ప్రాంతాల్లో పర్యటించడానికి వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం.. సింధుదుర్గ్ జిల్లాలో విమానాశ్రయాన్ని నిర్మించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలను పంపించింది. దీన్ని ఆమోదించింది కేంద్రం.
ఈ విమానాశ్రయం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. అందుబాటులోకి వచ్చింది. చిప్లి వద్ద దీన్ని నిర్మించారు. చిప్లి ఎయిర్పోర్ట్గా పిలుస్తున్నారు. ఈ మధ్యాహ్నం కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ వెంటనే- అలయెన్స్ ఎయిర్.. 70 సీట్ల సామర్థ్యం ఉన్న ఏటీఆర్ 72-600 ఎయిర్ క్రాఫ్ట్ను ప్రారంభించింది కూడా. ముంబై నుంచి సింధుదుర్గ్ విమానాశ్రయానికి ఈ విమానాన్ని రోజూ నడిపిస్తుంది.
పర్యాటకుల రద్దీ అత్యధికంగా ఉండే గోవాకు సమీపంలో ఉండటం, పశ్చిమ కనుమలు విస్తరించిం ఉండటం, కోస్తా తీర ప్రాంతం కావడం వల్ల సింధుదుర్గ్ ఇక పర్యాటక రంగంలో అగ్రగామిగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే చెప్పారు. ప్రతిరోజూ ముంబై నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మిగిలిన నగరాల నుంచి కూడా విమానాలు నడిపేలా చర్యలను తీసుకుంటామని, సింధుదుర్గ్ను సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు అన్ని వసతులను కల్పించేలా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
CM Uddhav Balasaheb Thackeray flagged off the first flight from Sindhudurg 🛫Mumbai#chipiairport pic.twitter.com/fR2rQn1t8r
— CMO Maharashtra (@CMOMaharashtra) October 9, 2021