Zomato Share: జొమాటో షేర్లను వదిలిచ్చుకున్న ఉబెర్.. స్టాక్ ర్యాలీకి బ్రేక్.. షేర్లు అమ్మేయాలా..?
Zomato Share: రెండు రోజులుగా జొమాటో కంపెనీ పేరు వార్తల్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఈ వారం కంపెనీ తన క్వార్టర్లీ ఫలితాలను విడుదల చేయటం, కంపెనీలో బ్లాక్ డీల్ జరుగుతుందని వార్తల మధ్య ఈ స్టాక్ చర్చలోకి వచ్చింది.
మంగళవారం లాభాలు..
కంపెనీ నష్టాలు గతంలో కంటే భారీగా తగ్గిన నేపథ్యంలో స్టాక్ మంగళవారం ఏకంగా 20 శాతం ఎగబాకింది. అయితే నేడు ఉబెర్ కంపెనీ జొమాటోలో తన వాటాలను పూర్తిగా విక్రయిస్తుందనే వార్తల మధ్య ఇంట్రాడేలో స్టాక్ ఏకంగా 10 శాతం పతనాన్ని నమోదు చేసింది. అయితే ముగింపు సమయానికి తిరిగి పుంజుకుంది.
పెట్టుబడులను అమ్మేసిన ఉబెర్..
ఉబెర్ టెక్నాలజీస్ ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో బ్లాక్ డీల్ ద్వారా భారతీయ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్లోని తన 7.8% వాటాను 392 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఈ విషయం గురించి తెలిసిన రెండు వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థకు వివరాలను వెల్లడించాయి. జొమాటో బ్లాక్ డీల్ ఒక్కో షేరుకు రూ.50.44 అమ్మిన్నట్లు సమాచారం. దీనిపై రెండు కంపెనీలూ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
డీల్ వివరాలు..
ఈ రోజు జరిగిన బ్లాక్ డీల్ ఆఫర్ పరిమాణం 61 కోట్ల షేర్లుగా ఉంది. అయితే ఎవరు కొన్నారన్న వివరాలు బహిర్గతం కాలేదు. ఫిడిలిటీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇండియాస్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్తో సహా దాదాపు 20 గ్లోబల్ అండ్ ఇండియన్ ఫండ్స్ ఈ వాటాను కొనుగోలు చేసినట్లు సమాచారం.
రిటైలర్ల పరిస్థితి..
ఇప్పటికైతే కొంత మేర జొమాటో షేర్లను ఇన్వెస్టర్లు పోర్ట్ ఫోలియోలో కొనసాగించవచ్చని.. జెమ్స్టోన్ ఈక్విటీ రీసెర్చ్ & అడ్వైజరీ సర్వీసెస్, కన్సల్టింగ్ టెక్నికల్ అనలిస్ట్ అండ్ వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ అన్నారు. అయితే స్టాక్ ఈ మధ్య కాలంలో భారీ కరెక్షన్ తరువాత పెరుగుతుండటంతో దానిని ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించేందుకు వినియోగించుకోవచ్చని ఆయన అంటున్నారు. అయితే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు స్టాక్ వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.