ట్విట్టర్ సంచలనం ... ఎప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయం తీసుకున్న తొలి సంస్థ
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ విధించారు. అయితే చాలా ఐటీ సంస్థలు , సోషల్ మీడియా దిగ్గజాలు సైతం తమ ఉద్యోగులకు లాక్ డౌన్ ముగిసే వరకు వర్క్ ఫ్రమ్ హోం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో ఏ సంస్థ తీసుకోని సంచలన నిర్ణయం తీసుకుంది . సోషల్ మీడియా, టెక్ దిగ్గజం అయిన ట్విట్టర్ తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది. ఇది ఎవరూ ఊహించని సంచలనం .
లాక్ డౌన్ ఐడియా .. రిలయన్స్ జియో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్
ఎప్పటికీ వర్క్ ఫ్రమ్ హోం పని చేసుకోవచ్చని ఉద్యోగులకు చెప్పిన ట్విట్టర్
ఒక్క లాక్ డౌన్ సమయంలోనే కాదు ఎప్పటికీ వర్క్ ఫ్రమ్ హోం పని చేసుకోవచ్చని చేసిన ప్రకటన సంచలనం కాగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా ట్విటర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యింది . ట్విటర్ సీఈవో జాక్ డోర్సే కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకి ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రిమోట్గా పనిచేసుకునే అవకాశమున్న తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసుకోవచ్చని అందులో ఎలాంటి ఇబ్బందులు లేవని ట్విటర్ ప్రకటించింది.
అసాధారణ పరిస్థితుల్లో అనూహ్య నిర్ణయం తీసుకున్న ట్విట్టర్
కరోనా లాక్ డౌన్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది . ఒక వేళ లాక్ డౌన్ ఎత్తేసినా కరోనా కట్టడి అంత ఈజీ టాస్క్ కాదు . సెప్టెంబరుకు ముందు వరకు చాలా కార్యాలయాలను తిరిగి తెరిచే అవకాశం లేనందున ఆఫీసుకు రావాలా వద్దా అనేది స్వయంగా వాళ్లే నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది. సాధ్యం అయితే రావచ్చని , లేదా ఇళ్ళ నుండే పని చేసుకోవచ్చని ఆప్షన్ ఇచ్చింది . కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ హెచ్ ఆర్ చీఫ్ జెన్నిఫర్ క్రైస్ట్ వెల్లడించారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది పని చేస్తున్నారు . ఇక వారందరి విషయంలో ఇది ఊహించని నిర్ణయమని పేర్కొన్నారు.
ఉద్యోగులు వెళ్ళాలనుకుంటేనే ఆఫీసుకు .. లేదంటే ఎప్పటికీ వర్క్ ఫ్రమ్ హోం
సీఈవో జాక్ డోర్సే 2020 మధ్యలో మూడు నుండి ఆరు నెలల వరకు ఆఫ్రికాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభ కాలంలో ఆయన దానిని వాయిదా వేసుకున్నారు. ఇక ఉద్యోగులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇళ్ళ నుండే పని చేసుకునేలా వెసులుబాటు ఇచ్చారు. ఎప్పటికీ ఉద్యోగులు అవసరం అనుకుంటే ఇళ్ళ నుండే వర్క్ చేసుకోవచ్చని చెప్పారు. కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదు అని భావిస్తున్న తరునమలోనే ఈ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించిన ఫేస్బుక్, గూగుల్
మరోవైపు కరోనా , లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో ఇప్పటికే ఫేస్బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులలో చాలా మందిని ఈ సంవత్సరం చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోం చెయ్యటానికి వెసులుబాటు కల్పించాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు గాను మే 22 న ఒక రోజు సెలవు తీసుకోవాలని ఉద్యోగులను కోరినట్లు గూగుల్ గత వారం తెలిపింది. ఇక ప్రస్తుతం ట్విట్టర్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఎవరూ ఊహించనిది .