ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (అక్టోబర్ 26) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు(1.33%) పాయింట్లు నష్టపోయి 40,145.50 వద్ద, నిఫ్టీ 162.60 పాయింట్లు(1.36%) దిగజారి 11,767.80 వద్ద ముగిసింది. మార్కెట్లు కుప్పకూలడంతో నేడు ఒక్కరోజే రూ.1.92 లక్షల ఇన్వెస్టర్ల సంపద తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా సహా పలు మార్కెట్లు నష్టపోవడంతో ఈ ప్రభావం మన మార్కెట్ పైన పడింది. వీటికి అదనంగా భారత దిగ్గజ కంపెనీ, బీఎస్ఈలో 17 శాతం వాటా కలిగిన రిలయన్స్ 3.70 శాతం మేర నష్టపోవడం భారీగా దెబ్బతీసింది.
రిలయన్స్కు అమెజాన్ షాక్, కుప్పకూలిన మార్కెట్! సెన్సెక్స్ 540 పాయింట్లు డౌన్.. కారణాలివే..
ముఖేష్ వర్సెస్ జెఫ్ బెజోస్.. రూ.1.92 లక్షల కోట్లు హాంఫట్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ , జెఫ్ బెజోస్కు చెందిన అమెజాన్ మధ్య ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలుపై టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ముఖేష్ వర్సెస్ జెఫ్ బెజోస్గా ఉంది. ఫ్యూచర్ గ్రూప్ను రిలయన్స్ రూ.24వేల కోట్లకు పైగా పెట్టుబడులతో కొనుగోలు చేసింది. దీనిపై అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లింది. అమెజాన్కు ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. దీంతో రిలయన్స్ షేర్ భారీగా పడిపోయింది. ఓ విధంగా సెన్సెక్స్ భారీగా నష్టపోవడానికి ఇది కూడా కీలక కారణ. బీఎస్ఈలో 17 శాతానికి పైగా వాటా కలిగిన రిలయన్స్ దాదాపు 4 శాతం దిగజారడం ఎక్కువ ప్రభావం చూపింది.
రూ.158 లక్షల కోట్లు..
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ రోజు ఒక్కరోజే రూ.1.92 లక్షల కోట్లు క్షీణించి రూ.158.66 లక్షల కోట్లకు పడిపోయాయి. రిలయన్స్ దాదాపు 4 శాతం క్షీణించగా, ఆటో, మెటల్ స్టాక్స్ కూడా కుప్పకూలాయి. గతవారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు, అంతకుముందు వారం ఒక్కరోజే 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. వరుసగా పది రోజుల ర్యాలీని ఆ గురువారం దెబ్బతీసింది. ఆ తర్వాత నాలుగు రోజుల వరుస ర్యాలీకి గత గురువారం బ్రేక్ ఇచ్చింది. ఇండియా వీఐఎస్ (ఇండికేటర్ ఆఫ్ వోలాటిలిటీ) దాదాపు 15 శాతం పెరిగింది.
స్టాక్స్ పైకి, కిందకు ఎన్ని..
దిగ్గజ కంపెనీల్లో HDFC లైఫ్ ఇన్సురెన్స్ 3 శాతానికి పైగా ఎగిసి రూ.582.35 వద్ద క్లోజ్ అయింది. నెస్ట్లే ఇండియా, కొటక్ మహీంద్ర బ్యాంకు, ఇండస్ ఇండ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ కంపెనీలు ఒక శాతం నుండి మూడు శాతం మేర పెరిగాయి. హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో ఒక్కొక్కటి ఆరు శాతానికి పైగా, హిండాల్కో 5.34 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.69 శాతం, జేఎస్డబ్ల్యు స్టీల్ 4.39 శాతం కోల్పోయింది. స్మాల్ క్యాప్ 1 శాతానికి పైగా పడిపోయింది. మిడ్ క్యాప్ 1.71 శాతం నష్టపోయింది.
వెయ్యి స్టాక్స్ వరకు లాభాల్లో, 1678 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. 123 సెక్యూరిటీస్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. 65 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. 260 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ లిమిట్ను, 221 స్టాక్స్ లోయర్ సర్క్యూట్ లిమిట్ను తాకాయి.