JioPhone Next..బ్యాడ్ న్యూస్: కారణాలివే: ఇంకెప్పుడు లాంచ్?
ముంబై: మొబైల్ హ్యాండ్ సెట్ సెక్టార్లో మచ్ అవైటెడ్గా అనిపించిన జియోఫోన్ నెక్స్ట్.. చివరి దాకా ఊరించి..చివరికి ఉసూరుమనిపించింది. మార్కెట్లో రిలీజ్ అయిన వెంటనే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవడానికి కొనుగోలుదారులు అన్నీ సిద్ధం చేసుకుని కూర్చున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాడ్ న్యూస్ను వినిపించింది రిలయన్స్-గూగుల్ మేనేజ్మెంట్. ఈ స్మార్ట్ఫోన్ ఇప్పట్లో మార్కెట్లో లాంచ్ కావట్లేదు. మళ్లీ ఎప్పుడు ఆవిష్కరిస్తారనే విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది.
ఇక అప్పటిదాకా కొనుగోలుదారులు తమ ఎదురు చూపులను కొనసాగించక తప్పదు. నిజానికి- వినాయక చవితి మరుసటి రోజే జియోఫోన్ నెక్స్ట్ను మార్కెట్లో విడుదల చేస్తామంటూ ఇదివరకు రిలయన్స్ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్లో ఏర్పాటైన రిలయన్స్ జియో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ మొబైల్ హ్యాండ్సెట్కు సంబంధించిన వివరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా వెల్లడించారు.
గూగుల్తో కలిసి దీన్ని డెవలప్ చేస్తోన్నామని, అత్యాధునికమైన ఫీచర్లతో దీన్ని కొనుగోలుదారుల ముందుకు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 10వ తేదీన మార్కెట్లో విడుదల చేస్తామని కూడా ముఖేష్ అంబానీ అప్పట్లో స్పష్టం చేశారు. తీరా గడువు దగ్గర పడిన తరువాత- రిలయన్స్ యాజమాన్యం వెనకడుగు వేసింది. జియోఫోన్ నెక్స్ట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
దీపావళి పండగ సీజన్లో ఈ ఫోన్ను ప్రజల ముందుకు తీసుకొస్తామని పేర్కొంది. దసరా-దీపావళి సీజన్లో దీన్ని తీసుకుని రావడానికి చురుగ్గా ప్రయత్నిస్తోన్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్రకటనలో పొందుపరిచింది. చిప్ల కొరత కారణంగా- జియోఫోన్ నెక్స్ట్ను వాయిదా వేసినట్లు తెలిపింది. ఆశించిన స్థాయిలో చిప్లు అందుబాటులో ఉండట్లేదని స్పష్టం చేసింది. ఒకసారి మార్కెట్లో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన తరువాత, దాని కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది.
చిప్ల కొరత.. ఇప్పటికే వాహన రంగాన్ని కుదేల్ చేస్తోన్న విషయం తెలిసిందే. చాలినన్ని చిప్స్ అందుబాటులో లేకపోవడం వల్ల మారుతి సుజుకి వంటి టాప్ కార్ మాన్యుఫాక్చరర్స్ కంపెనీ సైతం తన ప్రొడక్షన్ను కుదించుకోవాల్సిన పరిస్థితిని చవి చూసింది. ఇప్పటికీ డిమాండ్కు అనుగుణంగా చిప్స్ దొరకట్టేదనే అభిప్రాయాలు మార్కెట్లో వర్గాల్లో నెలకొని ఉన్నాయి. కొందరు దీన్ని కృత్రిమ కొరతగా భావిస్తోన్నారు. ఉద్దేశపూరకంగా చిప్ల కొరతకు కారణం అయ్యారనీ అంటున్నారు.