దూసుకెళ్తున్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు, ఛార్జీల పెంపుతో మీపై భారం ఎంతంటే!?
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్ తమ మొబైల్ సేవల టారిఫ్ పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, డిసెంబర్ ప్రారంభంలో పెంచనున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. జియో రాకతో ఛార్జీల పోరుకు తోడు ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పై రెండు కంపెనీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టారిఫ్ పెంచుతున్నాయి.
వినియోగదారులకు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షాక్, ఛార్జీల పెంపు
పెంచక తప్పడం లేదు
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించాలంటే టారిఫ్ పెంచక తప్పదని ఎయిర్టెల్ పేర్కొంది. టెలి పరిశ్రమ ఎప్పటికప్పుడు మారుతోందని, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమని పేర్కొంది. ఇండియన్ మొబైల్ రంగంలో ధరల హేతుబద్ధీకరణకు ట్రాయ్ నడుం బిగించగలదన్న ఆశాభావాన్ని ఎయిర్టెల్ వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కార్యదర్శుల కమిటీ టెలికం పరిశ్రమ కష్టాలు తీర్చేందుకు ఓ పరిష్కారం చూపగలదని వొడాఫోన్ ఐడియా కూడా అభిప్రాయపడింది.
ఒకప్పటితో పోలిస్తే 95% ధరలు తగ్గాయి
మొబైల్ ధరలు ఒకప్పటితో పోల్చితే దాదాపు 95 శాతం వరకు తగ్గాయని, గిగాబైట్ రూ.11.78కు పరిమితమైందని ట్రాయ్ పేర్కొంది. మొబైల్ కాల్ ఛార్జీలు దాదాపు 60% తగ్గాయని, జూన్ 2016 నుంచి డిసెంబర్ 2017 మధ్య కాలంలో నిమిషానికి దాదాపు 19 పైసలు ఉన్నట్లు పేర్కొంది. జియో వచ్చాక ఇండియన్ టెలికం రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఇటీవల నెట్ వర్క్స్ కాల్స్ పైన జియో నిమిషానికి 6 పైసలు ఐయూసీని వసూలు చేస్తోంది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ఛార్జీలు పెంచడంతో ప్రయివేటు నెట్ వర్క్స్ వినియోగదారులపై భారం పడనుంది.
షేర్ల దూకుడు..
టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ షేర్లు సోమవారం పుంజుకున్నాయి. ఎయిర్టెల్ షేర్ మంగళవారం ఉదయం 5.9 శాతం పెరగగా, వొడాపోన్ ఐడియా షేర్ 20 శాతం పుంజుకుంది. ఎయిర్టెల్ షేర్ రూ.433కి, వొడాఫోన్ ఐడియా షేర్ రూ.5.35కు పెరిగింది. టారిఫ్ పెంపు వల్ల కొంత నష్టం పూడ్చుకుంటాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
రూ.10 నుంచి రూ.20 భారం పడవచ్చు..
ఇది టెలికం రంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చేదని, టెలికం కంపెనీల షేర్ల ధరలు కూడా అలాగే పెరుగుతాయని భావిస్తున్నామని అంటున్నారు. టెలికం కంపెనీలు ఎక్కువగా టారిఫ్ విషయంలో స్మార్ట్ ఫోన్ యూజర్లపై దృష్టి సారిస్తారని భావిస్తున్నామని అంటున్నారు. అలాగే, స్మార్ట్ ఫోన్ యూజర్లపై కూడా రూ.10 నుంచి రూ.20 నామమాత్రం భారం పడవచ్చునని, అదే సమయంలో ఫీచర్ ఫోన్ వినియోగదారులు మినిమం ఛార్జ్ రూ.35తో ప్రారంభిస్తారని చెబుతున్నారు.