Investment: లక్షను రూ.2 కోట్లు చేసిన టాటా స్టాక్.. ప్రస్తుతం భారీ నష్టాల్లో.. అమ్మేయాలా..?
Investment: మార్కెట్లలో ఎల్లప్పుడూ ఒకటే ట్రెండ్ కొనసాగదు. దీనికి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న స్టాక్ పెద్ద ఉదాహరణ. అసలు ఆరు నెలలుగా పతనం అవుతున్న టాటా స్టాక్ ఒకప్పుడు ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేసింది. అయితే ప్రస్తుతం ఇందులో పెట్టుబడులను కొనసాగించాలా లేక అమ్మేయాలా అనే అయోమయంలో చాలా మంది ఉన్నారు. పరిస్థితిని తలకిందులు చేసిన కంపెనీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా స్టాక్..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది టాటా గ్రూప్ లోని Tata Elxsi షేర్ గురించి. గత 52 వారాల్లో స్టాక్ ధర అత్యధికంగా రూ.10,760ని తాకింది. అయితే స్టాక్ గత 6 నెలల కాలంలో దాదాపు 20 శాతం నష్టపోయింది. ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల కనిష్ఠ స్థాయికి సమీపంలోని రూ.6,850 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ నిపుణులు దీని గురించి ఏమి చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
స్టాక్ ధర రూ.35 నుంచి..
టాటా ఎలెక్సీ లిమిటెడ్ ఐటీ రంగంలో చురుగ్గా ముందుకు సాగుతోంది. జనవరి 1, 1999న Tata Elxsi లిమిటెడ్ షేర్ ధర కేవలం రూ.35గా ఉండేది. దాదాపు నవంబర్ 2013 నుంచి స్టాక్ వెనక్కి తిరిగి చూసుకోనంత ఊపందుకుంది. అలా 2018 ఆగస్టు 24న రూ.1,400 స్థాయిని దాటింది. ఆ తర్వాత 2020 మార్చి 20న రూ.598.60కి తగ్గింది. కానీ తర్వాత రాకెట్ వేగంతో పెరిగి 2022 ఆగస్టులో రూ.10,760 గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
లక్ష పెట్టుబడి..
ఒకప్పుడు రూ.లక్ష ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడిగా పెట్టిన వారికి స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. అలా ఆ పెట్టుబడి విలువ దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు మార్కెట్ పరిస్థితుల కారణంగా స్టాక్ భారీ క్షీణతను నమోదు చేస్తోంది.
ఇన్వెస్టర్ల పరిస్థితి..
టాటా ఎలెక్సీ షేర్లను ప్రస్తుత తరుణంలో కొనాలా లేక అమ్మాలా అనే సందిగ్ధింలో చాలా మంది ఉన్నారు. అయితే నిపుణులు మాత్రం టాటా ఎలెక్సీ షేర్లపై బేరిష్గా ఉన్నారు. మెుత్తం ఏడుగురిలో నలుగురు విశ్లేషకులు ఈ స్టాక్ను వెంటనే విక్రయించాలని సలహా ఇస్తున్నారు. మరో ఇద్దరు మాత్రం రూ.6,150 స్టాప్ లాస్తో స్టాక్ వదిలించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. కేవలం ఒక్క నిపుణుడు మాత్రమే పెట్టుబడిని కొనసాగించాలని సూచించారు.