దీపావళికే జియో ఫోన్ నెక్స్ట్, సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే
జియో-గూగుల్ సంయుక్తంగా తీసుకువస్తున్న జియో నెక్స్ట్ను దీపావళి సందర్భంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. కరోనా వల్ల భారత్ తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు. అయినప్పటికీ కొత్తగా స్మార్ట్ఫోన్లకు అలవాటుపడ్డవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడ్డవారి సంఖ్య పెరిగిందని, అలాగే ఇంకా ఫీచర్ ఫోన్స్ నుండి స్మార్ట్ ఫోన్స్కు మార్ందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇది తమకు ఓ అవకాశమన్నారు. జియోతో కలిసి ప్రాంతీయ భాషల వారికి అందుబాటు ధరలో ఫోన్ తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. దీంతో అనేకమందికి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కొత్త ఫోన్తో చాలామంది తొలిసారి ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటారన్నారు.
భారత్తో పాటు ఆసియా-పసిఫిక్ దేశాల్లో తమకు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే మూడు నుండి అయిదేళ్ల కాలంలో ఏళ్లలో పలు మార్పులు వస్తాయన్నారు. తమ ఉత్పత్తులు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతీయ భాషలు మాట్లాడే వ్యక్తులను కలిపేందుకు మరీ ముఖ్యంగా దేశంలోని 30 కోట్ల మంది 2G కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని జియోఫోన్ నెక్స్ట్ 4G స్మార్ట్ఫోన్ వస్తోంది.
దీపావళి రాబోతున్న నేపథ్యంలో 'మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్'ను జియో సోమవారం విడుదల చేసింది. ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురుచూస్తోన్న జియో ఫోన్ నెక్ట్స్కు సంబంధించిన ఆశయం, దాని ఆవిష్కరణ వెనుక ఉన్న ఆలోచనలను ఈ షార్ట్ వీడియో తెలియజేస్తుంది. భారతీయత కేంద్రబిందువుగా రూపుదిద్దుకున్న ఈ నూతన ఫోన్ ఇప్పటికే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే జియో భారత్లో ఇంటింటా వినిపించే పేరుగా మారింది. 43 కోట్ల మంది వినియోగదారులతో అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాల్లో, ఆదాయ వర్గాల్లో దీని సేవలు విస్తరించాయి. భారత్లో డిజిటల్ అనుసంధానతను ప్రజాస్వామీకరించాలనే తన ఆశయాన్ని జియో ఫోన్ నెక్ట్స్తో జియో మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.
జియో ఫోన్ నెక్ట్స్ అనేది భారతదేశంలో తయారైంది, భారత్ కోసం తయారయింది. ఇది మేడిన్ ఇండియా ఫోన్. డిజిటల్ సాంకేతికతకు ప్రతీ భారతీయుడు కూడా సమాన అవకాశాలు, సమాన యాక్సెస్ పొందేలా జియో ఫోన్ నెక్ట్స్ ఉంటుంది. కోట్లాదిమంది భారతీయుల జీవితాలను మార్చేలా జియో ఫోన్ నెక్ట్స్ ఎలా తయారైందో ఈ వీడియో తెలియజేస్తుంది.ఆండ్రాయిడ్ శక్తితో కూడిన ప్రగతి ఓస్ అంతర్జాతీయ స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్. ప్రత్యేకించి భారతదేశం కోసం రూపొందించబడిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ జియో ఫోన్ నెక్ట్స్ కు గుండెకాయగా ఉంటుంది. 'ప్రగతి'ని అందరికీ అందించాలన్న ఆశయంతో జియో, గూగుల్ లోని అత్యుత్తమ నిపుణులతో ఇది రూపుదిద్దుకుంది. ఇది అందుబాటు ధరలో తిరుగులేని అనుభూతిని అందిస్తుంది.
జియో ఫోన్ నెక్ట్స్ ప్రాసెసర్ సాంకేతిక అగ్రగామి అయిన క్వాల్ కామ్ చే రూపొందించబడింది. జియో ఫోన్ నెక్ట్స్ లో ఉండే క్వాల్ కామ్ ప్రాసెసర్ ఈ ఉపకరణం పనితీరు, ఆడియో, బ్యాటరీలను గరిష్ఠ స్థాయిలో పని చేసేలా చేయడమే గాకుండా అత్యుత్తమ రీతిలో అనుసంధానతను, లొకేషన్ సాంకేతికతలను అందిస్తుంది.