సంవత్ 2076లో పాతాళం నుండి రికార్డులు, సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్
సంవత్ 2076కు స్టాక్ మార్కెట్లు రికార్డ్ లాభాలతో వీడ్కోలు పలికాయి. గత ఏడాది దీపావళి నుండి నిన్నటి వరకు సెన్సెక్స్ 4,385 పాయింట్లు (11.22 శాతం), నిఫ్టీ 1,136 పాయింట్లు (9.80 శాతం) చొప్పున ఎగిశాయి. శుక్రవారం ట్రేడింగ్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్లు భారీగా రాణించాయి. ఐటీ స్టాక్స్ కూడా అదరగొట్టాయి. కరోనా నేపథ్యంలో మార్చి నెలలో మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత నుండి తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం సెన్సెక్, నిఫ్టీ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.
సెన్సెక్స్, నిఫ్టీ ఎంత లాభపడ్డాయంటే
స్టాక్ మార్కెట్లు సంవత్ 2076కు లాభాలతో ముగిశాయి. వరుస లాభాలతో రికార్డ్స్ సృష్టించిన మార్కెట్లు గురువారం నష్టపోయాయి. శుక్రవారం బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల కొనుగోళ్ల మద్దతుతో తిరిగి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు (0.20%) పెరిగి 43,443 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు (0.23%) ఎగిసి 12,720 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో సంవత్ 2076లో సెన్సెక్స్ 4,384.94 పాయింట్లు, నిఫ్టీ 1,136.05 పాయింట్లు ఎగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 1,549.94 పాయింట్లు(3.69%), నిఫ్టీ 456.40 పాయింట్లు(3.72%) లాభపడ్డాయి. గురువారం మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లకపోయి ఉంటే మరింత రికార్డుకు చేరుకునేవి. ఇక నిన్న డాలర్ మారకంతో రూపాయి 2 పైసలు ఎగిసి 74.62 వద్ద ముగిసింది. ఈ వారం ట్రేడింగ్లో రూపాయి 54 పైసలు నష్టపోయింది.
కాగా, సంవత్ 2077లో ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమొబైల్స్, మెటల్స్, కెమికల్, టెలికం, రంగాలు వృద్ధి కనబరిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఆల్ టైమ్ గరిష్టానికి విదేశీ మారకపు నిల్వలు
విదేశీ మారకపు నిల్వలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీతో ముగిసిన వారంలో 7.779 బిలియన్ డాలర్లు పెరిగి 568.494 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారెన్ కరెంట్ అసెట్స్ భారీగా పెరిగి ఆర్బీఐ తెలిపింది. ఈసారి 6,403 బిలియన్ డాలర్లు పెరిగి 524.742 బిలియన్ డాలర్లుగా ఉంది.
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు (FPIలు) రూ..1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశఈ ఫండ్స్ డీఐఐలు రూ.2239 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.
సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్చేంజీలు నేడు గంట పాటు ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. సంవత్ 2077ని స్వాగతిస్తూ సాయంత్రం గం.6.15 నుండి గం.7.15 వరకు ట్రేడింగ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం దీపావళి రోజున మొదలయ్యే కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు ఇలా స్పెషల్ ట్రేడింగ్తో ఆహ్వానం పలుకుతాయి. కాగా, దీపావళి బలి ప్రతిపద సందర్భంగా మార్కెట్లకు సోమవారం సెలవు.