శుక్రవారం..శుభప్రదంగా స్టాక్ మార్కెట్: వీకెండ్లో లాభాల జోష్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం చివరి రోజు లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ గ్రీన్జోన్లో ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. ప్రారంభంలోనే 300లకు పైగా పాయింట్ల లాభంతో షేర్ మార్కెట్ కార్యకలాపాలు ఆరంభం అయ్యాయి. ఆ కొద్దిసేపటికే డౌన్ఫాల్ రికార్డయినప్పటికీ- అది ఎక్కువ సేపు నిలవలేదు. గ్రాఫ్ మళ్లీ పైపైకి ఎగబాకింది. అన్ని ప్రధాన ఇండైసీస్కు చెందిన షేర్ల గ్రాఫ్ అప్పర్ సర్క్యుట్ ట్రేడ్ అవుతున్నాయి.. ఇంట్రాడే ట్రేడింగ్ ఇదే తరహాలో ఉంటుందని, లాభాలు పంచుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ప్రారంభంలోనే 400 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. 54,700 పాయింట్లను దాటుకుంది. తొలిగంటలో గరిష్ఠంగా 54,717 పాయింట్ల వరకు వెళ్లింది. అక్కడి నుంచి మళ్లీ క్షీణించడం మొదలు పెట్టింది. 54,521.62 పాయింట్లకు దిగజారింది. దీనితో దాదాపు అన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్ల ధరలు పడిపోయాయి. మైనస్లో ట్రేడ్ అవుతూ కనిపించాయి. రెడ్ జోన్లో జారిపోయాయి. రెండో గంట ఆరంభమైన కొద్దిసేపటికే మళ్లీ సెన్సెక్స్ పుంజుకొంది. 54,610.84 పాయింట్లకు చేరుకుంది.
నిఫ్టీ 50 కూడా పెద్దగా లాభపడలేదు. 50 పాయింట్లతో ఇవ్వాళ నిఫ్టీ 50 ట్రేడింగ్ ఆరంభమైంది. తొలిగంటలో గరిష్ఠంగా 16,317 పాయింట్లకు వెళ్లింది గానీ.. మళ్లీ కిందికి పడింది. తొలి గంట కార్యకలాపాలు ముగిసే సమయానికి16,245.35 పాయింట్ల వద్ద నిలిచింది. పడుతూ లేస్తూ సాగుతోంది. సెన్సెక్స్తో పోల్చుకుంటే నిఫ్టీలో కొంత క్షీణత కనిపించింది. ఈ రెండూ అక్కడితోనే ఆగుతాయా? లేక సాయంత్రానికి మరింత దిగజారతాయా? అనేది ఉత్కంఠభరితంగా మారింది.
తొలి గంటలో ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాసూటికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్కు చెందిన షేర్లు కొంతమేర నష్టపోయాయి. టాటా స్టీల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ షేర్లు రెడ్ జోన్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, మారుతి సుజుకి స్టాక్స్ తొలిగంటలో టాప్ గెయినర్స్గా రిజిస్టర్ అయ్యాయి. ఇంట్రాడే మొత్తంగా సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.