మార్కెట్లు పతనం నుండి రికార్డ్స్థాయికి.. కరోనా తీవ్రత సహా కారణాలివే..
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా మార్చి 25వ తేదీన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. అంతకు రెండు రోజుల ముందు అంటే మార్చి 23, సోమవారం దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. 30 షేర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 25,981 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. కరోనాకు అలవాటు పడటం, కేసులు తగ్గుముఖం పట్టడం, జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు వేగంగా పుంజుకోవడం వంటి వివిధ కారణాలతో ఇప్పుడు సెన్సెక్స్ జీవనకాల గరిష్టం 43వేల మార్క్ దాటింది.
నిన్న (సోమవారం, నవంబర్ 10) సెన్సెక్స్ 704 పాయింట్లు (1.6 శాతం) ఎగిసింది. నిఫ్టీ 196 పాయింట్లు (1.6 శాతం) లాభపడి 12,461 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు సెన్సెక్స్ ఏకంగా 650 పాయింట్లకు పైగా లాభపడి 43,255 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 12,620ని దాటింది.
జోబిడెన్ ఎఫెక్ట్, భారత మార్కెట్లో రూ.2 లక్షల కోట్లు పెరిగిన సంపద
మార్కెట్లు పతనం నుండి రికార్డ్కు ప్రధాన కారణం ఇది!
ఈ ఏడాది కరోనాకు ముందు జనవరిలో సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటున్న సమయంలో తిరిగి ఆ రికార్డ్స్ను కూడా అధిగమించాయి. మార్చి నెలలో కరోనా మహమ్మారి ప్రభావాన్ని అందరూ చాలా ఎక్కువగా ఊహించి ఉంటారని, అంటే ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారని, కానీ ఈ వైరస్ సమస్య ఊహించినంత తీవ్రంగా లేదని ఇప్పుడు భావిస్తున్నారని, అందుకే మార్కెట్లు పుంజుకున్నాయని, రికార్డ్ గరిష్టాన్ని తాకుతున్నాయని, ఇది ముఖ్యమైన కారణమని హెలియోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫౌండర్, ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా అన్నారు.
ప్యాకేజీ మరో కారణం
భారత్ సహా వివిధ దేశాల మార్కెట్ల సూచీలు భారీగా ఎగిశాయని, కొన్ని గరిష్టాన్ని తాకాయని గుర్తు చేస్తున్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ ఆర్థిక వ్యవస్థలు భారీ ప్యాకేజీలు ప్రకటించడం, ఆ ప్రకటనలు కొనసాగుతుండటం కూడా మార్కెట్ల పుంజుకోవడానికి దోహదపడ్డాయని కేఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దెవెన్ చోక్సీ అన్నారు. మార్చి నుండి ఇప్పటి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 8 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయని గుర్తు చేశారు.
పెట్టుబడులు...
ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ అనుకూల గమ్యస్థానంగా కనిపిస్తోందని, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని, దీంతో చైనా కంటే భారత్ అనుకూలమైన గమ్యస్థానంగా మారుతోందని చోక్సీ అన్నారు.
అయితే మార్కెట్ ర్యాలీ ద్రవ్యత కారణంగా పుంజుకుంటుందా లేక కంపెనీల బలం లేదా ఫండమెంటల్ ద్వారానా? అంటే.. ఫండమెంటల్ లేదా లిక్విడిటీ అనేవి అంశాలు కాదని, పెట్టుబడులు ఎక్కడకు వెళ్లినా ఫండమెంటల్ పైన ఆధారపడి రిలయన్స్ లేదా పీఎస్యూ బ్యాంకులకు వెళ్తాయని చెబుతున్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపు
ద్రవ్యతతో పాటు మార్కెట్ల ఊతానికి దోహదపడిన మరో అంశం వడ్డీ రేట్ల కోత అని నిపుణులు అంటున్నారు. మార్చి నుండి ఆర్బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోత విధించింది 2019 ఫిబ్రవరి నుండి 250 పాయింట్ల మేర కోపడి 4 శాతానికి దిగి వచ్చింది. దీంతో పెట్టుబడులు ఈక్విటీల వైపు మరలాయి.
అలాగేత చమురు ధరల బిల్లు తగ్గడంతో మిగులు కలిసి వచ్చింది. అమెరికా ఎన్నికల ఫలితాలు పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసాన్ని నింపాయని చోక్సీ అన్నారు.