ఊగిసలాటలో మార్కెట్లు: ఐటీ డౌన్, ఫార్మా హిట్, బలపడిన రూపాయి
ముంబై: నిన్న భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమై, మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు (నవంబర్ 26, గురువారం) ఊగిసలాటలో ఉన్నాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 113.07 పాయింట్లు(0.26%) లాభపడి 43,941.17 వద్ద, నిఫ్టీ 33.90 పాయింట్లు(0.26%) ఎగిసి 12,892.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
707 షేర్లు లాభాల్లో, 217 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 52 స్టాక్స్లో ఎలాంటి మార్పులేదు. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 35 పాయింట్ల నష్టంలో, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంలో ఉంది. సెన్సెక్స్ గతవారం 44వేల రికార్డుకు దిగువన, నిఫ్టీ 13,000 మార్కు కిందకు వచ్చాయి. ఫార్మా సహా కొన్ని మినహా మిగతా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.
బంగారం ధర తగ్గుతూనే ఉంది, రూ.1800 భారీ క్షీణత: రూ.60,000 దిగువకు వెండి
రిలయన్స్ స్టాక్ రూ.2000 లోపే
టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 2.12 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.09 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.05 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.06 శాతం, అదానీ పోర్ట్స్ 1.13 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 2.16 శాతం, మారుతీ సుజుకీ 1.68 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.54 శాతం, టెక్ మహీంద్రా 1.42 శాతం, ఇన్ఫోసిస్ 1.39 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి.
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర నేడు స్వల్పంగా ఎగిసింది. ప్రారంభంలో నష్టపోయినప్పటికీ ఆ తర్వాత 0.036 శాతం పెరిగి రూ.1949 వద్ద పలికింది. రిలయన్స్ స్టాక్ ఇప్పటికీ రూ.2000కు లోపే ఉంది.
ఐటీ స్టాక్స్ నష్టాల్లో
నిఫ్టీ 0.01 శాతం పడిపోయింది. మిడ్ క్యాప్ 0.36 శాతం, స్మాల్ క్యాప్ 0.16 శాతం లాభపడింది.
నిఫ్టీ ఆటో 0.20 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.64 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.07 శాతం, నిఫ్టీ ఐటీ 0.48 శాతం, నిఫ్టీ మీడియా 0.11 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.06 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంకు 0.13 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.34 శాతం, నిఫ్టీ మెటల్ 0.13 శాతం, నిఫ్టీ ఫార్మా 0.60 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 0.28 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.20 శాతం లాభపడ్డాయి.
ఐటీ స్టాక్స్లో టీసీఎస్ 0.14 శాతం, ఇన్ఫోసిస్ 1.20 శాతం, టెక్ మహీంద్ర 1.55 శాతం, మైండ్ ట్రీ 0.66 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
హెచ్సీఎల్ టెక్ 0.99 శాతం, విప్రో 0.36 శాతం, కోఫోర్జ్ 1.63 శాతం లాభపడ్డాయి.
రూపాయి ప్రారంభం ఇలా..
డాలర్ మారకంతో రూపాయి 73.83 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.91 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు స్వల్పంగా 9 పైసలు లాభంతో ప్రారంభమైంది. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) రూ.24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్(DII) రూ.1,840 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం FPIలు రూ.4,563 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, డీఐఐ రూ.2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.