నేడు మార్కెట్లకు ఊరట: ముఖేష్ అంబానీ ఎంత నష్టపోయారంటే? ప్రపంచ కుబేరులకు చుక్కలు
ముంబై: సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, మంగళవారం మాత్రం లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 1,212.60 పాయింట్లు (4.67%), నిఫ్టీ 353.85 పాయింట్ల లాభంతో ప్రారంభించింది. చివరకు సెన్సెక్స్ 692.79 పాయింట్ల(2.67%) లాభంతో 26,674.03, నిఫ్టీ 190.80 పాయింట్ల (2.51%) లాభంతో 7,801.05 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. దాదాపు అన్ని రంగాల లాభాల్లోనే ముగిశాయి.
మార్కెట్: బిగ్గెస్ట్ సింగిల్ డే నష్టం, ఈ షేర్ ఒక్కటే నిలబడింది! పతనానికి కారణాలు..
భారీగా లాభపడ్డ, నష్టపోయిన షేర్లు
మంగళవారం భారీగా లాభపడ్డ షేర్లలో ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనీ లీవర్ ఉన్నాయి. నిఫ్టీలో భారీగా నష్టపోయిన షేర్లలో యస్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి.
నిన్న ఒక్కరోజే రూ.14 లక్షల కోట్లు నష్టం
మంగళవారం మార్కెట్లు లాభాల్లో ముగియడంతో మొత్తంగా చాలా రోజుల తర్వాత ఇన్వెస్టర్లు నష్టపోలేదు. సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. రికార్డ్ సింగిల్ డే నష్టాన్ని చవిచూశాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో సంపదను కోల్పోయారు. నిన్న పెట్టుబడిదారుల సంపద ఒక్క రోజులో రూ.14 లక్షల కోట్లు హరించుకుపోయింది.
మార్కెట్ క్యాప్ భారీగా తగ్గింది
ట్రేడర్ల అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్లోని 30 లిస్టెడ్ కంపెనీల షేర్లు నిన్న నష్టపోయాయి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీల... అన్ని రంగాల షేర్లు కుప్పకూలాయి. తీవ్ర అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో సోమవారం బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. ఈ ఒక్కరోజే అక్షరాలా రూ.14,22,207.01 కోట్లు నష్టపోగా మార్కెట్ క్యాప్ రూ.1,01,86,936.28 కోట్లకు చేరుకుంది.
ఈ నెలలోనే 50 లక్షల కోట్లు
విదేశీ సంస్థాగత మదుపరులు రూ.3వేల కోట్ల పెట్టుబడులను వెనక్కి వెళ్లాయి. మార్చి నెలలోనే సెన్సెక్స్ నిన్నటి వరకు దాదాపు 15వేల పాయింట్లు కోల్పోయి సంపద సుమారు రూ.50 లక్షల కోట్లు హరించుకుపోయింది. వెయ్యికి పైగా కంపెనీల షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈరోజు కాస్త కుదురుకున్నాయి.
రిలయన్స్ పతనం
రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ సోమవారం నాటికి భారీగా కరిగిపోయింది. షేర్ ధర ఏకంగా 13% పతనం కావడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.86 వేల కోట్లు కోల్పోయింది. ఇంట్రాడేలో 14% పతనం కావడంతో షేర్ ధర చివరకు 13.37% తగ్గి రూ.883.85 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.86,435.91 కోట్లు తగ్గి రూ.5,60,296.16 కోట్లకు దిగజారింది.
కరిగిన ముఖేష్ అంబానీ ఆస్తులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ క్యాలెండర్ ఇయర్ను ఆసియా కుబేరుడిగా ప్రారంభించాడు. కానీ కరోనా ఆయన ఆస్తులను కరిగిస్తోంది. 58 బిలియన్ డాలర్లతో ఆసియా రిచ్చెస్ట్ పర్సన్గా ఉన్న ముఖేష్ మూడు నెలలు కాకముందే రెండోస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ముఖేష్ వద్ద 38 బిలియన్ డాలర్ల ఆస్తి ఉంది. 19వ స్థానంలో ఉన్నారు. మంగళవారం రిలయన్స్ షేర్ కాస్త్ ఎగిసినా వెయ్యి లోపు (రూ.946) వద్ద ఉంది.
ఆస్తులు కోల్పోయిన మిగతా వారు..
కరోనా దెబ్బకు ప్రపంచ కుబేరులు తమ సంపదను కోల్పోయారు. LVMH ఫౌండర్ బెర్నార్డ్ అర్నాల్ట్ ($45.3 బిలియన్లు), ఇండిటెక్స్ చైర్మన్ అమానికో ఓర్టిగా ($27.1 బిలియన్లు), బెర్క్షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ ($21.6 బిలియన్లు), మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ($20.8 బిలియన్లు) కోల్పోయారు. టాప్ 500 బిలియనీర్లు మార్చి నెలలో 200 బిలియన్ డాలర్లు కోల్పోయారు.