ఇక పసిడి సెక్యూరిటీ: త్వరలో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్
ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్(EGRs)ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తమ ప్లాట్ఫామ్ పైన EGRs పరిచయం చేసేందుకు అవసరమైన టెక్నాలజీని సిద్ధం చేసినట్లు బీఎస్ఈ ఆదివారం తెలిపింది. దేశవ్యాప్తంగా పసిడి ధర ఒకేలా ఉండేందుకు ఇది దోహదం చేయనుందని బీఎస్ఈ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ పాటిల్ తెలిపారు. అంతర్గతంగా అవసరమైన అనుమతులు తీసుకోవడం సహా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకొని, ఈ కొత్త సెక్యూరిటీస్ ట్రేడింగ్ను తమ ప్లాట్ఫామ్ పైన ప్రారంభిస్తామన్నారు.
ప్రస్తుతం దేశంలో పసిడి డెరివేటివ్స్, ఈటీఎఫ్(ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్) రూపంలో ట్రేడింగ్ చేసేందుకు అనుమతి ఉంది. ఇతర దేశాల్లో అయితే పసిడి ట్రేడింగ్కు స్పాట్ ఎక్స్చేంజీలు ఉన్నాయి. బంగారాన్ని ప్రతిబింబించే పెట్టుబడి సాధనాలను EGRsగా పేర్కొంటారు. వీటిని సెక్యూరిటీలుగా నోటిఫై చేస్తారు.
దీంతో ఇతర సెక్యూరిటీస్ మాదిరి ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది. తొలుత పసిడి లోహం బరువుకు అనుగుణంగా EGRsను రూపొందిస్తారు. డీమ్యాట్ రూపంలో ఉండే వీటిని ట్రేడింగ్ చేస్తారు. వీటిని స్టాక్ ఎక్స్చేంజీలు సెటిల్ చేస్తాయి. అవసరమైతే మెటల్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రారంభంలో EGRsను 1 కిలో, 100 గ్రాములు పరిమాణాల్లో బీఎస్ఈ అందుబాటులోకి తీసుకు రావొచ్చు. ఆ తర్వాత దశలవారీగా 50 గ్రాములు, 10 గ్రాములు, 5 గ్రాములు వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులు, ఖజానాలు, హోల్ సేల్ - రిటైల్ వ్యాపారులు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు EGR ట్రేడింగ్లో భాగస్వామ్యం అవుతారు.
మరోవైపు, సిల్వర్ ఈటీఎఫ్లను మార్కెట్లోకి జారీ చేసేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు అనుమతులు ఇస్తూ సెబి నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు దేశంలో ఈక్విటీ ETFs కాకుండా గోల్డ్ ETFs మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సిల్వర్, ప్లాటినమ్, పల్లాడియం వంటి లోహాల్లోను ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ఈటీఎప్స్కు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. వీటితో పోర్ట్ఫోలియో మరింత డైవర్సిఫికేషన్ చేయడానికి వీలు కలుగుతుంది. ముడిచమురు ఈటీఎఫ్లకు కూడా అనుమతివ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో గతవారం జరిగిన బోర్డు సమావేశంలో కొత్తగా సిల్వర్ ETFs జారీకి సెబీ అంగీకరించింది. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ చట్టాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపింది.