Postal Scheme: రోజూ 50 రూపాయలు డిపాజిట్ చేస్తే.. ఒకేసారి రూ. 35 లక్షలు.. మీరూ తెలుసుకోండి..
Postal Scheme: భారతీయ తపాలా శాఖ అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తోంది. పోస్టాఫీసు స్కీమ్ లో పెట్టుబడి పెట్టి కోట్లాది మంది ప్రజలు మంచి రాబడులను పొందుతున్నారు. అందువల్లనే చాలా మంది పోస్టల్ స్కీమ్స్ లో చిన్న మెుత్తాల్లో డబ్బును సేవ్ చేసుకుంటుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే పోస్టాఫీసులో డబ్బు పెట్టుబడి పెట్టడం రిస్క్ లేనిది కావటమే. ప్రజలు అందులోనూ గ్రామీణులు తమ డబ్బును సురక్షితమైన, మెరుగైన రాబడి అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటారు. కాబట్టి వారు కొంత రాబటి తక్కువగా ఉన్నప్పటికీ పోస్టల్ స్కీమ్స్ అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంతకీ ఆ పోస్టాఫీసు పథకం ఏమిటంటే.. గ్రామ సురక్ష యోజన(Gram Suraksha Yojana). దీని కింద చిన్న మెుత్తమైన రూ.50 రోజూ మదుపు చేయటం ద్వారా రూ.35 లక్షల రాబడిని పొందవచ్చు.
ఇందులో ఎవరు పెట్టుబడి పెట్టేందుకు అర్హులు..
గ్రామ సురక్ష యోజన అనేది గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్లో ఒక భాగం. ఈ బీమా పాలసీ దేశంలోని గ్రామీణ ప్రజల కోసం 1995లో ప్రారంభించబడింది. 19 - 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండేవారు గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రీమియం చెల్లించడానికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రీమియంను నెలవారీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.
రిటర్న్స్ ఎలా ఉంటాయి..
గ్రామ సురక్ష యోజన స్కీమ్ కింద ఒక వ్యక్తి ప్రతి నెలా ఈ పథకంలో రూ.1,515 అంటే రోజుకు కనీసం రూ.50 పెట్టుబడి పెడితే.. వారు రూ.35 లక్షల వరకు రాబడిని పొందవచ్చు. మీరు 19 ఏళ్ల వయస్సులో గ్రామ సురక్ష పథకం కింద పొదుపు చేయటం ప్రారంభిస్తే 55 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రూ. 1,515 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఎంత కాలానికి ఎంత చెల్లించాలి..
మీరు 58 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకాన్ని తీసుకుంటే.. మీరు ప్రతి నెలా రూ.1,463 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయస్సు వరకు అయితే ప్రతి నెలా రూ.1,411 చెల్లించాలి. మీరు ప్రీమియంను సకాలంలో చెల్లించలేక పోతే.. మీరు దానిని 30 రోజుల్లోగా డిపాజిట్ చేయవచ్చు. మీరు ఈ పథకం రాబడిని పరిశీలిస్తే, పెట్టుబడిదారుడు 55 ఏళ్లు చేరుకునే వరకు పెట్టుబడిపై రూ.31.60 లక్షలు, 58 ఏళ్లు చేరుకునే వరకు పెట్టుబడి పెడితే రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడిపై రూ.34.60 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందుతారు.
ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే..
గ్రామ సురక్ష యోజన కింద 80 ఏళ్లు నిండిన వ్యక్తికి ఈ మొత్తాన్ని అందజేస్తారు. వ్యక్తి మరణించినట్లయితే.. ఈ మొత్తం వ్యక్తి చట్టపరమైన వారసులకు లేదా నామినీకి చెందుతుంది. ఈ స్కీమ్ కింద పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత కస్టమర్ గ్రామ సురక్ష పథకాన్ని సరెండర్ చేయవచ్చు. అయితే.. ఆ సందర్భంలో దానితో ఎటువంటి ప్రయోజనం ఉండదు. పాలసీ అతిపెద్ద హైలైట్ ఇండియా పోస్ట్ అందించే బోనస్ అని చెప్పుకోవాలి. చివరిగా ప్రకటించిన బోనస్ ప్రతి రూ. 1,000కి సంవత్సరానికి రూ.60 బోనస్ రూపంలో అందించింది.