మార్కెట్ 'రికవరీ', 4 నెలల గరిష్టానికి జంప్: చైనా కాంపోజిట్ సహా కారణాలెన్నో!
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (జూలై 6) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 466 పాయింట్లు (1.29 శాతం) లాభపడి 38,487 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు (1.47 శాతం) ఎగిసి 10,763 పాయింట్ల వద్ద ముగిసింది. 1596 షేర్లు లాభాల్లో, 1144 షేర్లు నష్టాల్లో ముగియగా, 182 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో, టాటా మోటార్స్, రిలయన్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ, బజాజ్ ఆటో, గెయిల్, విప్రో, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి.
ఐటీ రంగానికి ఊహించని దెబ్బ: ఈసారి నష్టపోయినా... కంపెనీల ఆశ అదే
ఫార్మా, ఎఎఫ్ఎంసీజీ నష్టాల్లో..
మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. 4 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. నిఫ్టీ లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత్ర ఎక్కువగా ఉంది. నిఫ్టీ బ్యాంకు 347 పాయింట్లు లాభపడగా, మిడ్ క్యాప్ 254 పాయింట్లు లాభపడింది. కరోనా నేపథ్యంలో ఇటీవలి వరకు ఎగిసిన ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా మిగతా రంగాలు లాభాల్లో ఉండటం గమనార్హం. రియాల్టీ, ఆటో టాప్ గెయినర్స్గా నిలిచాయి.
అంతర్జాతీయంగా సానుకూలం
మార్కెట్లు లాభపడేందుకు పలు కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, పరిణామాలు సానుకూలంగా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. చైనా కాంపోజిట్ 850 రోజుల సగటును నేడు దాడి 5.8 శాతం లాభపడింది. ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఈ వైరస్ ప్రభావం తగ్గింది. జపాన్, హాంగ్కాంగ్, సౌత్ కొరియా సూచీలు భారీ లాభాల్లోకి వచ్చాయి.
కరోనా.. వ్యాక్సీన్
భారత్ సహా ప్రపంచ దేశాల్లో టీకా తయారీపై ఆశలు మరింతగా పెరిగాయి. భారత్ బయోటెక్ సహా వివిధ ఫార్మా కంపెనీలు తయారు చేస్తోన్న వ్యాక్సీన్ ముందడుగు వేస్తోంది. వివిధ మెడిసిన్స్తో చికిత్స కూడా వేగంగా కనిపిస్తోంది. కరోనా రికవరీలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రికవరీ పెరిగింది.
కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ
కొద్ది రోజులుగా ఆటోమొబైల్ సహా వివిధ రంగాలు క్రమంగా కోలుకుంటున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్లు 3 శాతం వరకు లాభపడ్డాయి. ఐటీ, విద్యుత్ రంగాలు కూడా 1.5 శాతం మేర లాభపడ్డాయి. ఆర్థిక వ్యవస్థల్లో క్రమంగా వేగం పుంజుకుంటోంది. అలాగే వివిధ నగరాల్లో లాక్ డౌన్ విధిస్తారనే ఆందోళనలు క్రమంగా తగ్గిపోయాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు పెరిగాయి.