వరుసగా లాభాలు... ఒక్కరోజులో రూ.1.41 లక్షల కోట్ల నష్టం
స్టాక్ మార్కెట్లు నేడు(గురువారం) భారీ నష్టాల్లో ముగిశాయి. ఇటీవల సెన్సెక్స్ 44 వేల జీవనకాల గరిష్టాన్ని తాకింది. నేడు ఆ మార్కుకు 400 పాయింట్ల దూరానికి క్షీణించింది. సెన్సెక్స్ 580 పాయింట్లు నష్టపోయి 43,600, నిఫ్టీ 167 పాయింట్లు పడిపోయి 12,772 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్తో పాటు ఐటీ సెక్టార్ దెబ్బతీసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం మనపై కనిపించింది. మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడంతో ఈ రోజు ఇన్వెస్టర్ల సంపద లక్ష కోట్లకు పైగా హరించుకుపోయింది.
ఏప్రిల్ నుండి రూ.40 లక్షల కోట్లు ఆర్జించారు, 10 ఏళ్లలో రిటర్న్స్ ఎంత అంటే?
మళ్లీ కేసులు పెరగడంతో..
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఫైజర్, మోడర్నా వంటి వ్యాక్సీన్ అభివృద్ధి సంస్థలు సానుకూల ప్రకటన చేయడంతో ఈక్విటీలు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే నేడు మాత్రం కరోనా కేసులు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ ప్రభావం మన మార్కెట్ పైన పడింది. దీనికి ఫైనాన్షియల్ స్టాక్స్ భారీ నష్టం తోడవడంతో సూచీలు పడిపోయాయి. 17 శాతం వెయిటేజీ కలిగిన రిలయన్స్ స్టాక్ 0.76 శాతం నష్టపోయింది. ఎస్బీఐ, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ మూడు శాతం నుండి నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి.
రూ.1.41 లక్షల కోట్లు డౌన్
నేడు దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.1.41 లక్షల వరకు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం నాటి రూ.171.44 లక్షల కోట్ల నుండి రూ.170.03 కోట్లకు తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.14 లక్షల కోట్ల దిగువన ఉంది.
ప్రాఫిట్ బుకింగ్
నిన్నటి వరకు 13 సెషన్లలో 12 సెషన్లు లాభాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసినట్లుగా కనిపిస్తోంది. నేడు 50 స్టాక్స్లో 36 నష్టాల్లో, 14 లాభాల్లో ముగిశాయి. లక్ష్మీ విలాస్ బ్యాంకులో సంక్షోభం నేపథ్యంలో ఆ స్టాక్ నిన్న 20 శాతం, నేడు మరో 20 శాతం నష్టపోయి రూ.10 వద్ద ఉంది. బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్కు ఎఫ్ఏఏ ఆమోదం నేపథ్యంలో స్పైస్ జెట్ స్టాక్స్ 12 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా మినహా మిగతా రంగాలు నష్టాల్లో ముగిశాయి. అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుంటోందని బార్క్లేస్ వెల్లడించగా, మూడీస్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును మైనస్ 10.6 శాతంగా అంచనా వేసింది.