మార్కెట్ సరికొత్త రికార్డ్, రూ.1.81 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే!
ముంబై: సెన్సెక్స్ సోమవారం రికార్డ్ హైకి చేరుకుంది. ఉదయం 40,440 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మార్కెట్ క్లోజింగ్ వరకు అలాగే కొనసాగింది. ఇంట్రాడేలో 40,931.71 పాయింట్లను తాకింది. చివరకు 529.82 పాయింట్ల లాభంతో 40,889.23 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్టస్థాయి వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 159 పాయింట్లు ఎగిసి 12,074 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,919.75 నుంచి 12,084 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్ ఇప్పుడు 41,000 సమీపంలో ఉంది. ఈ రికార్డ్ కూడా త్వరలోనే దాటుతుందని భావిస్తున్నారు.
కాల్స్, డేటా డిసెంబర్ 1 నుంచి ఇక భారం, కస్టమర్పై రూ100 వరకు
మార్కెట్ పుంజుకోవడానికి కారణాలెన్నో...
త్వరలో ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గిస్తుందనే అంచనాలు మార్కెట్ సెంటిమెంటును పెంచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే, త్వరలో వాణిజ్య యుద్ధంపై అమెరికా - చైనా దేశాలు ఓ అంగీకారానికి రావొచ్చునని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో కొనుగోళ్లకు ఇది కూడా మద్దతిచ్చింది. మరోవైపు, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళిక ద్రవ్యలోటును కట్టడి చేయగలదనే ఆశలు మన మార్కెట్లకు వచ్చాయి.
పెట్టుబడుల దిశగా...
ఆర్బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను మరింత తగ్గిస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్లను పెట్టుబడుల దిశగా నడిపించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని అంచనాలతో మెటల్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. జిందాల్ స్టీల్, టాటా స్టీల్, హిండాల్కో, నాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్ఎండీసీ, వేదాంత, సెయిల్, హిందూస్థాన్ జింక్ షేర్లు 1 శాతం నుంచి7 శాతానికి పైగా పెరిగాయి.
ఎక్కువ షేర్లు లాభాల్లో...
సెన్సెక్స్లోని 30 షేర్లలో 28 లాభాలతో ట్రేడ్ అయ్యాయి. భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, మారుతీసుజుకీ, కొటక్ బ్యాంకు, టాటా మోటార్స్, ఎస్బీఐ, హీరో మోటో కార్ప్, హెచ్యూఎల్ల షేర్లు 1 శాతం నుంచి 7 శాతానికి పైగా పెరిగాయి. ఓఎన్జీసీ, యస్ బ్యాంకు షేర్లు మాత్రం వరుసగా 2.17 శాతం, 1.70 శాతం మేర నష్టపోయాయి. రంగాలవారీగా అన్ని సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈలో 1400 షేర్లు లాభాల్లో, 1093 షేర్లు నష్టాలతో ముగిశాయి.
పెరిగిన RCom షేర్లు
నష్టాలతో సతమవుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్(RCom) షేర్లు ట్రేడింగ్లో ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని RCom దివాళా ప్రక్రియను ఎదుర్కొంటోంది. టెలికం సేవలకు దూరంగా ఉన్న RCom అప్పులు తీర్చేందుకు ఆస్తులను అమ్మేస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ షేర్ విలువ చాలాకాలం తర్వాత ఆరు శాతానికి పైగా పెరిగింది. బీఎస్ఈలో 4.55% పెరిగి 69 పైసల వద్ద, ఎన్ఎస్ఈలో 6.67% పెరిగి 80 పైసల వద్ద క్లోజ్ అయింది. ఆర్కామ్ ఆస్తుల కోసం సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్టెల్, వొడాఫోన్ - ఐడియాతోపాటు వివిధ సంస్థలు బిడ్స్ వేశాయి.
1.81 లక్షల కోట్లు పెరిగిన సంపద
మార్కెట్ల ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద సోమవారం ఒక్కరోజు భారీగా పెరిగింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ వ్యాల్యూ ఒక్క రోజులో రూ.1,81,930.89 కోట్లు పెరిగి రూ.1,54,55,740.67 కోట్లకు చేరింది. ఇదిలా ఉండగా, ఆసియా మార్కెట్లలో చైనా, హాంగ్కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు పుంజుకున్నాయి. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.