భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 580 పాయింట్లు డౌన్: బ్యాంకింగ్, ఐటీ దెబ్బ
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(నవంబర్ 19) భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ వారం వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. 44వేల మార్క్ దాటి సరికొత్త రికార్డ్ సృష్టించిన సెన్సెక్స్ కుంగిపోయింది. 43,600 దిగువకు చేరుకుంది. సెన్సెక్స్ 580.09 పాయింట్లు(1.31%) నష్టపోయి 43,599.96 పాయింట్ల వద్ద, నిఫ్టీ 166.60 పాయింట్లు (1.29%) కోల్పోయి 12,771.70 పాయింట్ల వద్ద ముగిసింది. 1179 షేర్లు లాభాల్లో, 1384 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 156 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బ్యాంకింగ్ రంగం 3 శాతానికి పైగా, ఐటీ స్టాక్స్ 1 శాతానికి పైగా కృశించాయి. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ సూచీలు మాత్రం లాభపడ్డాయి.
డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము ఉంది: లక్ష్మీ విలాస్ బ్యాంకు డిపాజిటర్లకు హామీ
ఏ దశలోను కోలుకోని మార్కెట్లు
మార్కెట్లు ఉదయం నుండి నష్టాల్లోనే ఉన్నాయి. ఏ దశలోను కోలుకున్న సంకేతాలు కనిపించలేదు. ఉదయం సెషన్లో రెండుసార్లు నిన్నటి ముగింపు (44,180) కంటే కాస్త పైకి కనిపించిన సెన్సెక్స్ ఆ వెంటనే కిందకు పడిపోయింది. రెండోసారి అంతకంతకూ దిగజారి 43,570 దిగువకు చేరుకుంది. చివరకు 43,600 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.37 శాతం, ITC 2.09 శాతం, NTPC 1.70 శాతం, టాటా స్టీల్ 1.24 శాతం, టైటాన్ కంపెనీ 0.96 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో SBI 4.86 శాతం, కోల్ ఇండియా 4.83 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.90 శాతం, ICICI బ్యాంకు 3.80 శాతం, JSW స్టీల్ 3.33 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
రిలయన్స్, ఐటీ స్టాక్స్ డౌన్
వరుసగా నాలుగు సెషన్లు లాభపడిన అనంతరం నేడు సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
నిఫ్టీ ఎనర్జీ 0.25 శాతం, నిఫ్టీ ఎఫ్ంసీజీ 0.43 శాతం, నిఫ్టీ మీడియా 0.26 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.67 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.29 శాతం, నిఫ్టీ ఐటీ 0.94 శాతం, నిఫ్టీ మెటల్ 0.72 శాతం, నిఫ్టీ ఫార్మా 0.40 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 3.10 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.36 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఐటీ నష్టాల్లో ముగిసినప్పటికీ, టీసీఎస్ 0.52 శాతం మాత్రం లాభపడింది. ఇతర స్టాక్స్ విషయానికి వస్తే హెచ్సీఎల్ టెక్ 1.19 శాతం, ఇన్ఫోసిస్ 1.22 శాతం, టెక్ మహీంద్ర 1.71 శాతం, విప్రో 0.71 శాతం, మైండ్ ట్రీ 1.22 శాతం, కోఫోర్జ్ 0.045 శాతం నష్టపోయాయి.
రిలయన్స్ స్టాక్ నేడు మరింత పడిపోయింది. 0.76 శాతం క్షీణించి రూ.1972 వద్ద క్లోజ్ అయింది.
మార్కెట్ నష్టాలకు కారణాలివే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వివిధ దేశాల్లో సెకండ్ వేవ్ భయపెడుతోంది. కోవిడ్ వల్ల వివిధ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్ పైన ప్రభావం చూపాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లు, భారత మార్కెట్లపై పడింది.
మార్కెట్లు భారీగా పతనం కావడానికి ఫైనాన్షియల్ స్టాక్స్ ప్రధాన కారణం. ఆ తర్వాత ఐటీ, మెటల్ రంగాల వల్ల కూడా నష్టపోయింది.
నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 0.23 శాతం క్షీణించింది. నిఫ్టీ బ్యాంకు 3 శాతం, నిఫ్టీ ఫిన్ సర్వీసెస్ 2.4 శాతం, ఐటీ, ఫార్మా స్టాక్స్ 1 శాతానికి పైగా క్షీణించడం గమనార్హం.