ఐటీ మినహా అన్నీ డౌన్: ఆగస్ట్ 27 తర్వాత తొలిసారి... డాలర్తో భారీగా నష్టపోయిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 29) నష్టాల్లో ఉన్నాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 308.76 పాయింట్లు (0.77%) క్షీణించి 39,613.70 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు (0.80%) పడిపోయి 11,635.60 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 231 షేర్లు లాభాల్లో, 743 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 39 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆ తర్వాత సెన్సెక్స్ నష్టాల్లోనే పైకి, కిందకు కదిలింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టంతో, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది.
ఒక్కరోజులో రూ.1.59 లక్షల కోట్ల సంపద ఆవిరి, 2 రోజుల్లో రూ.3.50 లక్షల కోట్లు..
ఆగస్ట్ 27 తర్వాత తొలిసారి... భారీగా బలహీనపడిన రూపాయి
డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు క్షీణించి రూ.74.05 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆగస్ట్ 27వ తేదీ తర్వాత మొదటిసారి 74.05 కనిష్టం వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.88 వద్ద ముగిసింది. దాదాపు రెండు నెలలుగా రూపాయి 74 కంటే దిగువనే ఉండి బలంగా కనిపించింది. అయితే ఇప్పుడు 74ను మరోసారి క్రాస్ చేసింది.
యూరోప్ సహా వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ భయాలు కమ్ముకున్నాయి. అలాగే సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ మారకం బలపడింది. 0.3 శాతం ఎగిసి 93.41 వద్ద ట్రేడ్ అయింది.
ఐటీ మినహా అన్నీ డౌన్
ఆటో, మెటల్ స్టాక్స్ ఒక్కో శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ మెటల్లో ఏపీఎల్ అపోలో, మిదానీ, రత్నమని మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, ఎన్ఎండీసీ, జేఎస్డబ్ల్యు, జిందాల్ స్టీల్ సహా అన్నీ నష్టాల్లోనే ట్రేడ్ కావడంతో 1.03 శాతం మేర నష్టపోయింది.
నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు, నిఫ్టీ మెటల్, 1 శాతం నుండి 2 శాతం మధ్య, నిఫ్టీ మీడియా 2 శాతానికి పైగా, నిఫ్టీ ఫిన్ సర్వ్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా 0.65 శాతం నుండి 1 శాతం మేర నష్టపోయాయి. కేవలం నిఫ్టీ ఐటీ మాత్రమే లాభాల్లో (0.28 శాతం) ఉంది.
టాప్ గెయినర్స్, లూజర్స్
మధ్యాహ్నం గం.1.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, అల్ట్రా టెక్ సిమెంట్, కొటక్ మహీంద్ర, టీసీఎస్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో లార్సెన్, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.
టీసీఎస్ స్టాక్ 0.91 శాతం ఎగిసి రూ.2,645.50, హెచ్సీఎల్ టెక్ 0.48 శాతం లాభపడి రూ.833.55, టెక్ మహీంద్ర 0.23 శాతం ఎగిసి రూ.806.15 వద్ద, విప్రో 0.36 శాతం లాభపడి రూ.336.85 వద్ద ట్రేడ్ అయింది.
ఇన్ఫోసిస్ 0.26 శాతం నష్టపోయి రూ.1,073.50 వద్ద, మైండ్ ట్రీ 0.69 శాతం నష్టపోయి రూ.1318 వద్ద, కోఫోర్జ్ 0.17 శాతం నష్టపోయి రూ.2,239.70 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లోను అదే
అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో ఈ ప్రభావం ఆసియా మార్కెట్లు, భారత్ మార్కెట్ పైన కనిపించింది. బుధవారం అమెరికా స్టాక్స్ మూడు శాతం మేర క్షీణించాయి. జూలై తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో డౌజోన్స్ పడిపోయింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 943 పాయింట్లు (3.43 శాతం), ఎస్ అండ్ పీ 119 పాయింట్లు (3.53 శాతం), నాస్డాక్ 426 పాయింట్లు (3.73 శాతం) నష్టపోయాయి. మరో ప్యాకేజీ ప్రకటనపై అమెరికా కాంగ్రెస్ విఫలం కావడం ఇన్వెస్టర్లను నిరాశకు గురి చేసింది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్ పైన కనిపించి నిక్కీ, స్ట్రెయిట్ టైమ్స్, హాంగ్షెంగ్, టైవాన్ వెయిటెడ్, కోస్పి, సెట్ కాంపోజిట్, జకర్తా కాంపోజిట్, షాంఘై కాంపోజిట్ 0.08 శాతం నుండి 1.41శాతం మేర పడిపోయాయి.