భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఎందుకంటే?
వరుసగా రెండు రోజుల భారీ లాభాల అనంతరం స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు స్వల్ప నష్టాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత అంతకంతకూ క్షీణించి చివరకు 750 పాయింట్లకు పైగా నష్టపోయింది. మొన్న 650 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, నిన్న అంతకుమించి ఎగిసి 776 పాయింట్లు లాభపడింది. రెండు రోజుల్లోనే 1400 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ నేడు సగం నష్టపోయింది. నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా నష్టపోయింది.
1100 పాయింట్లకు పైగా పైకి కిందకు
సెన్సెక్స్ నేడు 58,555.58 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,757.09 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,640.57 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు 1100 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. నిఫ్టీ 17,424.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,489.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,180.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పైకి, కిందకు కదలాడింది. చివరకు సెన్సెక్స్ 764.83 (1.31%) పాయింట్లు నష్టపోయి పాయింట్ల వద్ద, నిఫ్టీ 204.95 (1.18%) పాయింట్లు క్షీణించి 17,196.70 పాయింట్ల వద్ద ముగిసింది.
నష్టాలు ఎందుకు?
వరుసగా రెండు రోజుల పాటు భారీగా లాభపడటంతో నేడు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వరుస లాభాలతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపారు. మరోవైపు ఒమిక్రాన్ రీ-ఇన్ఫెక్షన్స్, దానిపై వ్యాక్సిన్ల సామర్థ్యం గురించి వస్తున్న ఊహాగానాలు ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేశాయి. నేడు వారాంతం కావడంతో వచ్చే రెండురోజుల్లో ఏ వార్తలు రానున్నాయనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. మరోవైపు అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ దీదీ ప్రకటించడం, మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే తనిఖీలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిందేననే అమెరికా ఎస్ఈసీ నిర్ణయం చైనా కంపెనీలను శరాఘాతమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
రిలయన్స్ డౌన్
రిలయన్స్ షేర్ నేడు దాదాపు మూడు శాతం మేర క్షీణించింది. రూ.69 తగ్గి రూ.2413 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 స్టాక్స్లో 25 షేర్లు నష్టపోయాయి. టైటాన్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు అధికంగా నష్టపోయాయి. ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.