ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు, ఇష్యూ ధర వద్దే స్టార్హెల్త్: ఝున్ఝున్వాలా ప్రాఫిట్ అలా రూ.6000 కోట్లు
స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్థిరంగా లేదా దాదాపు అతి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ వారం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, తర్వాత రెండు రోజులు అంతకుమించి జంప్ చేశాయి. రెండు రోజుల పాటు భారీగా లాభపడంతో నిన్నటి నుండి కాస్త ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. దీంతో నిన్న స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు, నేడు స్థిరంగా ముగిశాయి. నేడు వారాంతం కూడా కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. నేడు అమెరికా ద్రవ్యోల్భణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టం, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో ముగిసింది.
స్వల్ప నష్టాలకు పరిమితం
సెన్సెక్స్ నేడు ఉదయం 58,696.71 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,859.91 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,414.76 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,476.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,534.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,405.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 20.46 (0.035%) పాయింట్లు నష్టపోయి 58,786.67 పాయింట్ల వద్ద, నిఫ్టీ 5.55 (0.032%) పాయింట్లు నష్టపోయి 17,511.30 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 440 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన సూచీలు, రోజంతా అదే స్థాయిలో కొనసాగాయి. చివరి అరగంటలో మాత్రం కాస్త కోలుకొని, స్వల్ప నష్టాలకు పరిమితమయ్యాయి.
ప్రాఫిట్ వచ్చింది అంతలోనే..
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝూన్వాలా ప్రమోటర్గా వ్యవహరిస్తున్న స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సురెన్స్ కంపెనీ షేర్లు నేడు నిరాశపరిచాయి. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సురెన్స్ కంపెనీ నేడు మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ షేర్ ఇష్యూ ధర రూ.900. ఈ ఇష్యూలో 75 శాతం షేర్లను క్యాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్కు, 15 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఒ లాట్కు 16 షేర్లను కేటాయించారు. బీమా సంస్థల్లో ఇప్పటి వరకు ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ, ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సురెన్స్ లిస్ట్ అయింది. ఇది రూ.848 వద్ద బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఎన్ఎస్ఈలో 6 శాతం డిస్కౌంట్తో రూ.845 వద్ద లిస్ట్ అయింది.
స్టార్ హెల్త్ స్టాక్స్ నేడు ఓ సమయంలో రూ.940ని తాకింది. ఆ సమయంలో బిగ్ బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా సంపద రూ.6000 కోట్లకు పెరిగింది. అయితే ఆ తర్వాత స్టాక్ ఇష్యూ ధర వద్దే ముగిసింది.
నష్టపోయిన, లాభపడిన స్టాక్స్
HDFC, కోటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎల్ అండ్ టీ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో సూచీల మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. నిఫ్టీలో ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడ్డాయి. దివీస్ ల్యాబ్స్, టైటాన్, HDFC, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ, PSU బ్యాంక్ సూచీలు రాణించాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన షేర్లు లాభాల్లో ముగిశాయి.