అంతర్జాతీయ పరిణామాలతో జూమ్, 5 నెలల గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్, 11) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఐదు నెలల గరిష్టానికి చేరుకుంది. సెన్సెక్స్ 225 పాయింట్లు (0.59 శాతం) లాభపడి 38,407.01 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52.30 పాయింట్లు (0.46%) ఎగిసి 11,322.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1559 షేర్లు లాభాల్లో, 1146 షేర్లు నష్టాల్లో ముగియగా, 143 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
మార్కెట్లు ఉదయం కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 225 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ వరుసగా 6వ రోజు లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్, మెటల్ రంగాలు భారీ లాభాల్లో ముగిశాయి.
బలపడిన డాలర్.. భారీగా తగ్గిన బంగారం ధర: ఎంత తగ్గిందంటే?
ఐదు నెలల గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ
ఫార్మా, ఐటీ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. ఇందులో బ్యాంకింగ్, మెటల్ షేర్లు దూసుకెళ్లాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్వల్పంగా లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యాక్సిస్ బ్యాంకు, జేఎస్డబ్ల్యు స్టీల్, బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్, టైటాన్ కంపెనీ, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 5 నెలల గరిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటం, దేశంలోను రికవరీ రేటు పెరగడం ఇందుకు తోడ్పడింది.
పుంజుకున్న రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభంలో నష్టపోయి ఆ తర్వాత 0.61 శాతం లాభంతో ముగిసింది. ఈ రోజు కనిష్టంతో 1.5 శాతం లాభపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ రెండూ భారీగా లాభపడ్డాయి. ఈ రెండు కూడా ఒకటిన్నర శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంకు 1 శాతానికి పైగా లాభాల్లో ముగిసింది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రెండో రోజు లాభాల్లో ముగిశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. సెన్సెక్స్లో కాంట్రిబ్యూషన్ పరంగా టాప్ 5లో రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
బలపడిన రూపాయి
నిన్నటితో పోలిస్తే రూపాయి ఈ రోజు మరింత బలపడింది. నిన్న 74.89 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 12 పైసలు లాభపడి 74.77 వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం 74.83 వద్ద ప్రారంభమైంది. ఇదిలా ఉండగా, నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్స్(FPI) రూ.303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్ (DII) రూ.505 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం FPI రూ.397 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.439 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి.