తొలిసారి 50,000 మార్కు దాటి.. సెన్సెక్స్ సరికొత్త రికార్డ్
ముంబై: సెన్సెక్స్ సంచలనం సృష్టించింది. మార్కెట్ చరిత్రలో మొదటిసారి 50,000 పాయింట్లను క్రాస్ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో గత ఏడాది మార్చి 23న 26వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్ గోడకు కొట్టిన బంతిలా పుంజుకుంది. ఏడాది కూడా తిరగకముందే ఏకంగా మరో 24వేలకు పాయింట్లు జత కలిసి 50వేల మార్కును దాటింది.
గురువారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.30 సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా ఎగిసి 50,098 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభపడి 14,736 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి.
గత వారం చివరి సెషన్లో (శుక్రవారం) సెన్సెక్స్ 550 పాయింట్లు, ఈ వారం తొలి సెషన్ (సోమవారం)లో 470 పాయింట్లు కోల్పోయింది. అంటే ఈ రెండు రోజుల్లో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. అనంతరం మంగళవారం సెషన్లో 800 పాయింట్లకు పైగా లాభపడింది. బుధవారం 393 పాయింట్లు ఎగిసింది.