అదరగొట్టిన మార్కెట్లు.. భారీ లాభాల్లో: సెన్సెక్స్ 455 పాయింట్లు అప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 10) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 179.71 పాయింట్లు లేదా 0.47% ఎగిసి 38,373.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 55.40 పాయింట్లు లేదా 0.49% లాభపడి 11,333.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత గం.10.55 సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు ఎగిసి 38,646 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ స్పీడ్ చూస్తే ఈ రోజు 39,000 మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, రియాల్టీ రంగాలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.
15ఏళ్ల కనిష్టానికి హైరింగ్ సెంటిమెంట్, ఉద్యోగులను తీసుకునేది 3% కంపెనీలే!
రిలయన్స్ అదుర్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర దూసుకెళ్తోంది. రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్లో సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. కేకేఆర్ కూడా ఒక బిలియన్ డాలర్ల నుండి ఒకటిన్నర బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో రిలయన్స్ ఇటీవల దూసుకెళ్తోంది. ఉదయం గం.10.37 సమయానికి రిలయన్స్ షేర్ ధర 2.76 శాతం లేదా రూ.59.65 ఎగిసి రూ.2,221 పలికింది. రిలయన్స్ రికార్డ్ హైకి చేరుకుంది.
టాప్ గెయినర్స్, లూజర్స్
మోస్ట్ యాక్టివ్ కంపెనీల్లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకు ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ జాబితాలో బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్, యూపీఎల్, హిండాల్కో, టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.53 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
అంతర్జాతీయ మార్కెట్ జూమ్
అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మరోవైపు కరోనా రికవరీ పెరుగుతోంది. ఇది అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లకు ఊతమిచ్చింది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లు, అలాగే దేశీయ మార్కెట్లపై పడింది. నాస్డాక్ 2.71 శాతం, ఎస్ అండ్ పీ 2 శాతం లాభంతో ముగిశాయి. అమెరికాలో నిరుద్యోగిత డేటా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆర్థిక వ్యవస్థలు కాస్త వేగంగా పుంజుకుంటాయనే ఆశలు మార్కెట్ దూకుడుకు కారణమయ్యాయి.