ఫిబ్రవరి 25 తర్వాత తొలిసారి ఆ మార్క్, దూసుకెళ్లిన మార్కెట్లు: దుమ్మురేపిన రిలయన్స్, టైటాన్, ఐటీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం(అక్టోబర్ 7) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, కాసేపట్లోనే పుంజుకున్నాయి. అప్పటి నుండి క్లోజింగ్ వరకు భారీ లాభాల్లోనే కదలాడింది. చివరకు సెన్సెక్స్ 304.38 పాయింట్లు (0.77%) లాభంతో 39,878.95 వద్ద, నిఫ్టీ 76.50 పాయింట్లు (0.66%) లాభపడి 11,738.90 వద్ద ముగిసింది.
1040 షేర్లు లాభాల్లో, 1584 షేర్లు నష్టాల్లో ముగియగా, 200 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. రంగాలవారీగా చూస్తే ఆటో, ఇన్ఫ్రా, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు లాభాల్లో ముగిశాయి. మెటల్, ఫార్మా, ఎనర్జీ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటన.. మైక్రోసాఫ్ట్, FB, గూగుల్ సహా కుప్పకూలిన స్టాక్స్
ఫిబ్రవరి తర్వాత మొదటిసారి ఆ మార్క్కు నిఫ్టీ
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.22 శాతం మేర లాభపడటం దోహదపడింది. అబుదాబీకి కంపెనీ రిలయన్స్ రిటైల్లో రూ.5,512.50 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయడంతో రిలయన్స్ స్టాక్స్ ఎగిశాయి.
టైటాన్ కంపెనీ షేర్ ధర 4.50 శాతం (రూ.1,253.90) మేర లాభపడటం కూడా కలిసి వచ్చింది.
నిఫ్టీ 11,700కు పైగా ఎగిసింది. ఫిబ్రవరి 25వ తేదీ తర్వాత ఈ మార్క్కు మొదటిసారి చేరుకుంది.
మిడ్ క్యాప్ స్టాక్స్ ఆకట్టుకోలేకపోయాయి. ఈ సూచీలు 0.6 శాతం మేర క్షీణించాయి. మిడ్ క్యాప్ 88 పాయింట్లు పడిపోయింది.
నిఫ్టీ బ్యాంకు 111 పాయింట్లు ఎగిసి 22,965 వద్ద ముగిసింది.
నిఫ్టీలో రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ టాప్ కాంట్రిబ్యూటర్స్గా ఉన్నాయి.
క్యూ2 ఫలితాలు సానుకూలంగా ఉంటాయనే సమాచారంతో టైటాన్ 4 శాతానికి పైగా లాభపడింది.
సెప్టెంబర్ నెలలో ఆటో సేల్స్ పెరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం కొనసాగుతోంది. ఆటో స్టాక్స్ ఎగిశాయి. బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ 3 శాతానికి పైగా ఎగిశాయి.
రిలయన్స్ 2 శాతానికి పైగా లాభపడింది. బజాజ్ ఫైనాన్స్ నిఫ్టీ టాప్ లూజర్గా నిలిచింది.
ఇవి ఊతమిచ్చాయి
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి.
ఈరోజు యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి.
నిఫ్టీలో 26 షేర్లు లాభాల్లో ముగియగా, 24 షేర్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.
సెన్సెక్స్ 30లో 17 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
వ్యాల్యూమ్ పరంగా లాభాల్లో ముగిసి మార్కెట్కు ఊతమిచ్చిన వాటిలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్డీఎప్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
ఐటీ స్టాక్స్ అదుర్స్
ఈరోజు టీసీఎస్ తన రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటిస్తుంది. అలాగే షేర్ల బైబ్యాక్ పైన నిర్ణయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేర్ 1.42 శాతం లాభపడి రూ.2,752.80 వద్ద క్లోజ్ అయింది. HCL టెక్ షేర్ ధర 0.090 శాతం ఎగిసి రూ.829.90, ఇన్ఫోసిస్ షేర్ ధర 1.36 శాతం లాభపడి రూ.1,070.10, విప్రో షేర్ ధర 1.80 శాతం పెరిగి రూ.336 వద్ద, మైండ్ ట్రీ షేర్ ధర 1.46 శాతం పెరిగి రూ.1,392, కోఫోర్జ్ షేర్ ధర 0.0083 శాతం పెరిగి రూ.2,403.80 వద్ద క్లోజ్ అయింది. దిగ్గజ ఐటీ స్టాక్స్లలో టెక్ మహీంద్ర షేర ధర 0.047శాతం క్షీణించి రూ.847 వద్ద ముగిసింది.
ఉదయం స్తబ్దుగా.. కాసేపటికే జూమ్
మార్కెట్లు ఉదయం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. అయితే ప్రధాన షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించడంతో కాసేపటికే దూసుకెళ్లాయి.
ప్రధానంగా టీసీఎస్ ఫలితాలు ఉండటంతో ఆ కంపెనీ షేర్లు, రిలయన్స్లోకి పెట్టుబడులు వెల్లువెత్తడంతో ఈ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.
ఇక, మంగళవారం విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు రూ.1,102 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్ DII రూ.935 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.