బ్యాంకులపై జీడీపీ, మారటోరియం, రెపో దెబ్బ: భారీ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం నుండి వరుసగా మూడు రోజులు లాభాలను చూసిన సూచీలు ఈ రోజు నష్టాలు చూస్తున్నాయి. ఉదయం పది గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రెస్ మీట్ కూడా మార్కెట్లకు రుచించలేదు. పైగా జీడీపీ వృద్ధి రేటు తగ్గుదల, రెపో రేటు కట్, ఈఎంఐ మారటోరియం పొడిగింపు వంటి నిర్ణయాల వల్ల బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళనతో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల స్టాక్స్ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

పడిపోయిన బ్యాంకింగ్ షేర్లు
ఉదయం గం.9.30 సమయానికి సెన్సెక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయింది. ఆర్బీఐ ప్రకటన తర్వాత సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 9,000 కిందకు దిగజారింది. మధ్యాహ్నం గం.12 సమయానికి ఐసీఐసీఐ బ్యాంకు షేర్ 4.40 శాతం, హెచ్డీఎఫ్సీ షేర్ 4.31 శాతం, ఎస్బీఐ షేర్ 0.39 శాతం నష్టపోయాయి. బ్యాంకింగ్ షేర్లు సరాసరిన 2 శాతం మేర పడిపోయాయి.

రెపో రేటు తగ్గింపు, జీడీపీ, మారటోరియం..
మార్కెట్లు కుప్పకూలడానికి ఆర్బీఐ చేసిన ప్రకటన కూడా కారణమైంది. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు ప్రతికూలతగా ఉంటుందని శక్తికాంత దాస్ చెప్పారు. ఇది మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే మారటోరియం మరో 3 నెలలు పొడిగించడం, రెపో రేటు తగ్గించడం వంటి అంశాలు బ్యాంకులపై ఒత్తిడిని పెంచుతాయని ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధానంగా బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి.

ఐటీ షేర్లు మాత్రమే...
ఐటీ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ మారకంతో రూపాయి 74.99 వద్ద ట్రేడ్ అవుతోంది. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జీఎంటర్టైన్మెంట్, ఇన్పోసిస్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications