మూడ్రోజుల్లో 1800 పాయింట్లు పతనమైన సెన్సెక్స్: రూ.280 లక్షల కోట్ల నుండి రూ.273 లక్షల కోట్లకు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీగా నష్టపోయాయి. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్భణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. అలాగే మార్కెట్ ఇటీవలి గరిష్టస్థాయికి చేరుకోవడంతో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. మొన్న 554 పాయింట్లు నష్టపోగా, నిన్న 656 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ నేడు మరోసారి 634 పాయింట్లు పతనమైంది. ఈ మూడు రోజుల్లోనే 1800 పాయింట్లకు పైగా క్షీణించింది. దీంతో 60,000 పాయింట్ల దిగువకే కాదు, 59,500 పాయింట్ల కిందకు పడిపోయింది. నేడు ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం 60,045.48 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,045.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,068.31 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,921.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,943.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,648.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 634.20 (1.06%) పాయింట్లు నష్టపోయి 59,464.62 పాయింట్ల వద్ద, నిఫ్టీ 181.40 (1.01%) పాయింట్లు నష్టపోయి 17,757.00 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇన్వెస్టర్ల అప్రమత్తతతో గత మూడు రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూడు సెషన్లలో సెన్సెక్స్ 1800 పాయింట్లు కోల్పోవడంతో రూ.6.56 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. సోమవారం నాటికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ వ్యాల్యూ రూ.2.80 లక్షల కోట్లు కాగా, గురువారం నాటికి ఇది రూ.273 లక్షల కోట్లకు పడిపోయింది.