Market today: సెన్సెక్స్ 887 పాయింట్లు జంప్, ఈ స్టాక్స్ 15% ర్యాలీ
వరుసగా రెండు రోజుల భారీ నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్ మంగళవారం (డిసెంబర్ 7) భారీగా లాభపడింది. సెన్సెక్స్ 886 పాయింట్లు లేదా 1.56 శాతం ఎగిసింది. దీంతో 57,000 మార్కును క్రాస్ చేసింది. ఐటీ, ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో సూచీలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కట్ సానుకూల సంకేతాలు సూచీలకు అండగా నిలిచాయి. ఐరోపా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ అంత ప్రమాదం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. మరోవైపు, రేపు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఫలితాల్లో రేట్ల పెంపు ఉండదనే వార్తలు కూడా మార్కెట్కు ఊతమిచ్చాయి. దీంతో సూచీలు పరుగులు పెట్టాయి.
886 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 57,125.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,905.63 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,992.27 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,044.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,251.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,987.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
చివరకు సెన్సెక్స్ 886.51 (1.56%) పాయింట్లు లాభపడి 57,633.65 పాయింట్ల వద్ద, నిఫ్టీ 264.45 (1.56%) పాయింట్లు ఎగిసి 17,176.70 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ సమయంలో 1150 పాయింట్లకు పైగా ఎగిసింది. నేడు 900 పాయింట్లకు పైగా పైకి, కిందకు కదలాడింది.
ఆ ఒక్కటి మినహా
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా, బ్రిటానియా, దివిస్ ల్యాబ్స్, ఐవోసీ, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్లో ఒక్క ఏషియన్ పెయింట్స్ మినహా అన్ని షేర్లు లాభపడ్డాయి.
15 శాతానికి పైగా జంప్
నేడు పలు స్టాక్స్ పదిహేను శాతానికి పైగా జంప్ చేశాయి. DMR హైడ్రో ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (25.0%), హైటెక్ కార్పోరేషన్ (20.0%), Racl గేర్ టెక్ (20.0%), రాంకీ ఇన్ఫ్రా (19.99%), మోడీసన్ మెటల్స్ (19.98%), రాజ్ దర్శన్ ఇండ్ (19.97%), సూరజ్ లిమిటెడ్ (19.95%), అన్సాల్ హౌసింగ్ (19.92%), యూటిక్ ఎంటర్ప్రైజెస్ (19.88%), సార్థక్ మెటల్స్ (19.87%) లాభపడ్డాయి.