RBI వడ్డీ రేటు ఎఫెక్ట్, ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లు జంప్
స్టాక్ మార్కెట్లు బుధవారం(డిసెంబర్ 8) భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశానికి ముందు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందనే అంచనాలతో మార్కెట్ పరుగు పెట్టింది. అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంతదాస్ ప్రకటించిన నేపథ్యంలో సూచీలు అదే పరుగును కొనసాగించాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 900 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా ఎగిసింది. ఆర్బీఐ పరపతి నిర్ణయాలకు తోడు డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందనే వార్తలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.
ఎప్పుడు నిన్నటికి పైనే...
నేడు మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 58,158.56 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,539.72 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,122.27 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,315.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,436.30
పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,308.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు ఏ సమయంలోను నిన్నటి ముగింపు స్థాయికి రాలేదు. ఎప్పుడు కూడా నిన్నటి ముగింపుతో 500 పాయింట్లకు పైనే ఉంది.
మధ్యాహ్నం నాటికి సెన్సెక్స్ 30 సూచీల్లో కేవలం టైటాన్ మాత్రమే నష్టాల్లో ఉంది. మిగతా అన్ని స్టాక్స్ లాభాల్లోనే ఉన్నాయి.
రూ.3 లక్షల కోట్ల సంపద జంప్
బుధవారం మధ్యాహ్నం నాటికి ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఆర్బీఐ వడ్డీ రేటు స్థిరంగా కొనసాగిస్తుందనే అంచనాల నేపథ్యంలో మార్కెట్ ఉదయం నుండి లాభాల్లో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. నిన్నటి వరకు కూడా వరుసగా రెండు రోజుల పాటు మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నిన్న కూడా రూ.3.33 లక్షల కోట్లు పెరిగింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, గ్రాసీమ్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హెచ్డీఎఫ్సీ లైఫ్, దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్ ఉన్నాయి.