13 ఏళ్ల రికార్డ్కు బ్రేక్, రూ.3.28 లక్షల కోట్ల సంపద ఆవిరి: మూడీస్ హెచ్చరిక
స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 15) భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో 47 స్టాక్స్ నష్టపోయాయి. గత పది రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ ఒక్కరోజు ఇన్వెస్టర్లు రూ.3.28 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. 13 ఏళ్ల తర్వాత వరుసగా పదిరోజులపాటు మార్కెట్లు మంచి లాభాలు చూశాయి. పదమూడేళ్లలోని లాంగెస్ట్ ర్యాలీ (వరుసగా 10 రోజులు భారీ లాభాలు) నేటితో ముగిసింది. సెన్సెక్సీ 1,066 పాయింట్లు (2.61 శాతం) నష్టపోయి 39,728 వద్ద, నిఫ్టీ 291 పాయింట్లు (2.43 శాతం) పాయింట్లు కోల్పోయి 11,680 వద్ద ముగిసింది.
అమెరికా దెబ్బ.. ప్రాఫిట్ బుకింగ్ కోసం...
కరోనా కారణంగా కుంగిన అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని అమెరికా అధికార వర్గాల నుండి సంకేతాలు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలి, ఆ ప్రభావం మన మార్కెట్ పైన పడింది. యూరోప్లో మరోసారి కరోనా పెరుగుతోంది. ఆ దేశాల్లో లాక్ డౌన్, కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు ఇటీవల మంచి లాభాలు చూశాయి. ఇప్పుడు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రధానంగా ప్రభావం పడింది. దీంతో గత పది రోజుల్లో వచ్చిన లాభాల్లో దాదాపు సగం ఈ ఒక్కరోజు నష్టపోయింది.
మూడీస్ హెచ్చరిక
భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగా ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గురువారం పేర్కొంది. ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. భారత్ పరిమిత ప్యాకేజీలు సరిపోవని పేర్కొంది. 2020.21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 11.5 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని పేర్కొంది.
ఆసియా మార్కెట్లో భారీగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి. జపాన్, హంగ్కాంగ్ సహా ఆసియా దేశాల సూచీలు పడిపోయాయి.
వాలెటైలిటీ ఇండెక్స్
భారత వాలెటైలిటీ ఇండెక్స్(VIX) 9 శాతం వరకు పెరగంతో ఇన్వెస్టర్లు కలవరపడ్డారు. పదమూడేళ్ల పాటు ఎన్నడూ లేని విధంగా పది రోజుల పాటు వరుసగా బ్లూచిప్ షేర్లు ర్యాలీ చేశాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్ నష్టాలు తోడు కోవడంతో మార్కెట్లు భారీ నష్టాలను చూశాయి.