10 రోజుల లాభాల్లో 40% లాస్, కిందకు లాగిన బ్యాంక్, ఐటీ స్టాక్స్: మార్కెట్ నష్టాలకు కారణాలు ఇవే..
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 15) తేదీన భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభ నష్టాలతో క్లోజింగ్ సమయానికి పది రెట్ల నష్టం పెరిగింది. ఉదయం 100 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, వెయ్యి పాయింట్లకు పైగా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,066.33 పాయింట్లు (2.61%) నష్టపోయి 39,728.41 వద్ద, నిఫ్టీ 290.60 పాయింట్లు (2.43%) క్షీణించి 11,680.40 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 802 లాభాల్లో, 1797 షేర్లు నష్టాల్లో ముగియగా, 145 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్, ఐటీ భారీ నష్టాల్లో
స్టాక్ మార్కెట్లు ఈ రోజు 2.5 శాతం మేర నష్టపోయాయి. వరుసగా పది రోజుల పాటు లాభపడిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ 1.5 శాతం నుండి 2 శాతం మేర నష్టపోయాయి.
అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. నిఫ్యీ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ను కిందకు లాగాయి. ఇవి 3 శాతం నుండి 3.5 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 2.8 శాతం మేర నష్టపోయింది. ఫార్మా ఇండెక్స్ 1.7 శాతం క్షీణించింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఒక పాయింట్ చొప్పున నష్టపోయాయి.
టాప్ లూజర్స్... గెయినర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటో కార్ప్, కోల్ ఇండియా ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్ర, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. యాక్టివ్ స్టాక్స్లో ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి.
గత పది రోజుల్లో వచ్చిన లాభాల్లో 40 శాతం ఈ ఒక్కరోజే నష్టపోయింది.
నిఫ్టీ బ్యాంకు 802 పాయింట్లు క్షీణించి 23,072 పాయింట్ల వద్ద, మిడ్ క్యాప్ 287 పాయింట్లు కోల్పోయి 16,600 వద్ద క్లోజ్ అయింది.
ఈ ఒక్కరోజే బీఎస్ఈ లిస్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.3 లక్షల కోట్లు క్షీణించింది.
మార్కెట్ నష్టాలకు కారణాలు
స్టాక్ మార్కెట్ నష్టాలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లు, దేశీయ మార్కెట్లపై పడింది.
అమెరికా సూచీలు ఎస్ అండ్ పీ, నాస్డాక్ ఒక శాతం లోపు నష్టాల్లో ముగిశాయి. ఇతర అగ్రరాజ్యాల మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.
అలాగే మార్కెట్లు వరుసగా పది రోజుల పాటు లాభాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కోసం మొగ్గు చూపారు.
ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్ను కిందకు లాగాయి.
ప్రపంచవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ ఆందోళనలు కూడా మార్కెట్లను భయపెట్టాయి.