వీకెండ్లో స్టాక్ మార్కెట్స్ గుడ్ స్టార్ట్: రూపాయి.. రికవరీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవ్వాళ లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ గ్రీన్జోన్లో ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లో నెలకొన్న తిరోగమనాన్ని అధిగమించేలా ఉందివ్వాళ్టి మార్కెట్ పరిస్థితి. సాయంత్రానికి సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ ట్రెండ్కు అనుగుణంగానే మార్కెట్ ట్రేడ్ అవుతోంది. ఈ వీకెండ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లల్లో ఆశలను రేకెత్తించినట్టయింది.
ప్రారంభంలోనే 550 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. కొద్దిసేపటికే 70 పాయింట్ల మేర నష్టపోయింది. 470 పాయింట్లకు చేరుకుంది. మళ్లీ పుంజుకొంది. ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ మరింత క్షీణించలేదు. కీలకమైన సెగ్మెంట్స్కు సంబంధించిన షేర్లన్నీ గ్రీన్జోన్లో ట్రేడింగ్ అయ్యాయి. ఇన్వెస్ట్మెంట్స్ వైపు దృష్టి పెట్టడం వల్ల ఇంట్రాడే మొత్తం పాజిటివ్ గానే ఉంటుందనే సంకేతాలు స్టాక్ మార్కెట్స్ నుంచి వెలువడుతున్నాయి.
ప్రారంభంలో సెన్సెక్స్ 53,400 వద్ద ట్రేడింగ్ అయింది. నిఫ్టీ 150 పాయింట్ల మేర లాభపడింది. 16,000 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ఆరంభమైంది. కొద్దిసేపటికి సెన్సెక్స్, నిఫ్టీ రెండు నేలచూపులు చూశాయి. 53,328కి పడిపోయినప్పటికీ.. అది ఇంకా దిగజారకపోవడం ఇన్వెస్టర్లను ఊపిరి పీల్చుకునేలా చేసింది. నిఫ్టీ 16,000 దిగువకు ట్రేడ్ అయింది 15,958 వద్ద ట్రేడింగ్ అయింది. తొలి గంటలో ఫార్మాసూటికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్కు చెందిన షేర్లు కొంతమేర లాభపడ్డాయి.
తొలి గంటలో సన్ ఫార్మా టాప్ గెయినర్గా నిలిచింది. ఈ కంపెనీకి చెందిన షేర్ల ధరలు మూడుశాతం మేర పెరిగాయి. టాటా స్టీల్, టైటాన్ షేర్ల ధరలు కూడా పెరుగుదల బాట పట్టాయి. తొలి గంటలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ షేర్లు భారీగా తగ్గాయి. దీనితో పాటు భారతి ఎయిర్టెల్, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు పడిపోయాయి. మరోవంక రూపాయి విలువ కూడా కాస్త రికవరీ అయింది. ఎనిమిది పైసల మేర లాభపడింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 77.32 పైసలకు చేరింది. గురువారం రూపాయి విలువ 77.40 పైసలకు క్షీణించిన విషయం తెలిసిందే.