SBI Share: రాకెట్ లాగా దూసుకెళ్తున్న ఎస్బీఐ షేర్.. టార్గెట్ రేటు పెంచేసిన బ్రోగరేజ్ సంస్థలు..
SBI Share: ఇటీవలి కాలంలో దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులు మంచి త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాయి. ఈ సమయంలో పీఎస్యూ బ్యాంకులు ఊహించని స్థాయిలో లాభాలను గడించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా లాభాలు ఏకంగా 59% పెరిగి రూ.3,313 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సైతం మంచి లాభాలను నమోదు చేసింది.
భారీగా పెరిగిన షేర్..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ షేర్లు ఈరోజు ప్రారంభ ట్రేడింగ్లో ఐదు శాతం పెరిగాయి. దీంతో షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.622.90కి చేరుకుంది. బ్యాంక్ శనివారం విడుదల చేసిన తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ఊహించని అందరి అంచనాలను మించటంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా షేర్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు.
Q2 ఫలితాలు..
రెండో త్రైమాసికంలో ఎస్బీఐ కన్సాలిడేటెడ్ లాభం రూ.14,752 కోట్లకు పెరిగింది. దీంతో దేశంలోనే అతిపెద్ద లాభదాయక సంస్థగా ఎస్బీఐ అవతరించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎస్బీఐ షేర్లు 31 శాతం లాభపడ్డాయి. ప్రైవేటు రంగ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.11,125 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
రిలయన్స్ ను వెనక్కు నెట్టి..
భారీగా SBI ఆదాయం పెరుగుదలతో.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ను వెనక్కి నెట్టింది. సెప్టెంబర్తో ముగిసిన రెండవ త్రైమాసికంలో రిలయన్స్ లాభం రూ.13,656 కోట్లుగా నమోదైంది. అయితే ఇదే కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం ఏకంగా రూ.14,752 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ రూ.4,039 కోట్లు ఊహించని టాక్స్ చెల్లించాల్సి రావటంతో SBI ముందుకు వెళ్లింది.
బ్రోకరేజీల టార్గెట్..
SBI తాజా ఫలితాల ప్రకటనతో బ్రోకరేజీ సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ టార్గెట్ ధరను రూ.725కి పెంచింది. గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ రూ.715, నోమురా రూ.690, జేపీ మోర్గాన్ రూ.720, జెఫరీస్ రూ.760, గోల్డ్మన్ శాక్స్ రూ.770గా ఉంచారు. రానున్న కాలంలో స్టేట్ బ్యాంక్ ఇన్వెస్టర్ల సంపద మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.