కాగుతున్న క్రూడాయిల్ ధర: అమాంతం రేటు పెంచిన సౌదీ అరేబియా
రియాధ్: దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగే అవకాశం నెలకొంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ మార్కెట్లో చోటు చేసుకుంటోన్న పరిణామాల ప్రభావం దేశీయ చమురు అమ్మకాలపై పడే అవకాశం లేకపోలేదు. సౌదీ అరేబియా క్రూడాయిల్ రేట్లను అమాంతం పెంచింది. ఆ దేశ ఆయిల్ కంపెనీ ఆరమ్కో బ్యారెల్ ఒక్కింటికి 2.10 డాలర్ల మేర ధరను సవరించింది. దీనితో ఆసియా దేశాలకు సరఫరా అయ్యే క్రూడాయిల్ ధర బ్యారెల్ ఒక్కింటికి 6.50 డాలర్లకు చేరింది.
ఆసియా సహా..
భారత్ సహా ఆసియా దేశాలు యూరోప్ వాయవ్య ప్రాంతం, మిడ్టెర్రయిన్ రీజియన్లకు సరఫరా చేసే క్రూడ్ ధరలను సవరించింది. అమెరికాకు ఎగుమతి చేసే ఆయిల్ రేట్ల జోలికి మాత్రం వెళ్లలేదు. వాటిని యధాతథంగా కొనసాగిస్తోంది. దీనివల్ల క్రూడాయిల్ రేట్ భారీగా పెరిగింది. 121.95 డాలర్లకు చేరింది. క్రమంగా ఇది మరింత పెరగొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. బ్యారెల్ ఒక్కింటికి క్రూడాయిల్ ధర 125 డాలర్ల వరకు వెళ్లొచ్చని అంటున్నారు.
మూడు నెలల్లో రెండోసారి..
ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, రవాణా, షిప్పింగ్ సమస్యలు తలెత్తడం వల్ల వాటి రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆరమ్కో తెలిపింది. అఫీషియల్ సెల్లింగ్ ప్రైస్ (ఓఎస్పీ) పెంచినట్లు పేర్కొంది. మూడు నెలల వ్యవధిలో సౌదీ అరేబియా క్రూడాయిల్ ధరలను సవరించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రేట్లను పెంచింది. బ్యారెల్ ఒక్కింటికి అరబ్ లైట్ క్రూడ్ ధర 4.45 డాలర్లకు పెంచింది. ఇప్పుడు తాజాగా మరోసారి 2.10 డాలర్లను పెంచింది.
గ్రేడింగ్ ఇలా..
క్రూడాయిల్ గ్రేడింగ్ ప్రకారం.. సూపర్ లైట్, ఎక్స్ట్రా లైట్, లైట్, మీడియం, హెవీ రకాలుగా విభజించింది. వాటన్నింటి రేట్లను కూడా సవరించినట్లు ఆరమ్కో తెలిపింది. ఒక్కో రకానికి.. ఒక్కో రేటును నిర్దేశించిందా సౌదీ అరేబియా స్టేట్ ఓన్డ్ ఆయిల్ కంపెనీ. దీనితోపాటు ఆయిల్ ప్రొడక్టివిటీని కూడా పెంచాలని సౌదీ అరేబియా నిర్ణయించింది.
ఉత్పత్తి రెట్టింపు..
కిందటి వారం ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) దేశాలు తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం ప్రకారం.. ఒపెక్ దేశాలన్నీ కలిసి జులై నుంచి ప్రతి రోజూ 6,48,000 బ్యారెళ్ల మేర క్రూడ్ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా తాజాగా క్రూడాయిల్ రేట్లను పెంచడం వల్ల ఆసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రావడం దాదాపుగా ఖాయమైంది.
సౌదీ నుంచి..
దాదాపు 85 నుంచి 90 శాతం మేర పెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో అధిక వాటా ఇరాక్ది. ఇరాక్ నుంచి 27 శాతం మేర క్రూడాయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటోంది. సౌదీ అరేబియా-17, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-13 శాతం మేర దిగుమతులు ఉన్నాయి. తాజాగా సౌదీ తన రేట్లను పెంచడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పని పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది.