డాలర్ డౌన్, బలపడిన రూపాయి: మళ్లీ పెరిగిన చమురు, పెట్రోల్ ధరలు
డాలర్ మారకంతో రూపాయి ఈరోజు(ఆగస్ట్ 21, శుక్రవారం) బలపడింది. ప్రారంభ ట్రేడింగ్లో 11 పైసలు లాభపడి 74.91వద్ద ట్రేడ్ అయింది. దేశీయ మార్కెట్లు లాభాల్లో లాభాల్లో ఉండటం, అమెరికా కరెన్సీ బలహీనపడటంతో కలిసి వచ్చింది. నేడు రూపాయి ఐదు పైసలు బలపడి 74.96 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికి మరింత బలపడి 74.91కి చేరుకుంది. నిన్నటి సెషన్లో 75.02 వద్ద క్లోజ్ అయింది. ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉండటం, అమెరికన్ కరెన్సీ బలహీనపడటంతో రూపాయికి మద్దతు లభించినట్లు ఫారెక్స్ ట్రేడర్స్ చెబుతున్నారు.
చైనా కంపెనీలకు ఝలక్! హువావే, జెడ్టీఈ 5G ట్రయల్స్కు లేకుండా దరఖాస్తు
బలపడిన రూపాయి
అమెరికా డాలర్ మారకంతో రూపాయి 74.70 నుండి 75.20 మధ్య క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫారెక్స్ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ కరెన్సీ నిన్న బలహీనపడిన విషయం తెలిసిందే. నిన్న 75.02 వద్ద క్లోజ్ అయింది. ఈరోజు మళ్లీ బలవడింది. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్లు డేటా వెల్లడించడంతో డాలర్ క్షీణించింది.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా, నిఫ్టీ 96 పాయింట్లకు పైగా లాభాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు ఎగిసి 38,475 పాయింట్ల వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 11,388 వద్ద ట్రేడ్ అయింది. టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపీసీ, ఏషియన్ పేయింట్స్, ఎస్బీఐ, సన్ ఫార్మా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ ఉన్నాయి.
పెరుగుతున్న చమురు ధరలు
చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. వరుసగా మూడో రోజు పెరుగుదలను నమోదు చేశాయి. కరోనా మహమ్మారి నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కాస్త కోలుకున్న సంకేతాలు కనిపిస్తుండటంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.3 శాతం ఎగిసి బ్యారెల్ 42.95 డాలర్లు, బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి బ్యారెల్ 45.07 డాలర్లు పలికింది. దీనికి అనుగుణంగా దేశంలో కూడా పెట్రోల్ ధరలు స్వల్పంగా (17 పైసలు) పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర నిన్న కూడా స్వల్పంగా పెరిగింది. డీజిల్ ధరల్లో మార్పు లేదు.