మార్కెట్ దెబ్బ, ఆ రికార్డ్కు బలహీనపడిన రూపాయి: చమురు ధరలు మళ్లీ డౌన్
ముంబై: డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ ఈ రోజు (ఆగస్ట్ 20, గురువారం) నష్టపోయింది. ఉదయం 16 పైసలు పడిపోయి 74.98 వద్ద ప్రారంభమైంది. ఫెడరల్ రిజర్వ్ మినట్స్ తర్వాత ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ వ్యాల్యూ నిన్న పెరిగింది. ఇలా వివిధ కారణాలతో నిన్న 74.82 వద్ద క్లోజ్ అయిన భారత కరెన్సీ ఈ రోజు 74.98 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత నేటి గరిష్టం 75ను తాకింది. మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడం ప్రభావం చూపింది.
లోన్ మారటోరియం ఎఫెక్ట్, ఫైనాన్షియర్లకు 50,000 వాహనాల అప్పగింత?
రూపాయి మద్దతు ధర...
ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ మారకంతో రూపాయి 75.20 స్థాయి వద్ద పరీక్షను ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 75.30 నుండి 75.50 జోన్లో కదలవచ్చునని, ఆ తర్వాత 75.50 వద్ద సెటిల్ అయ్యే అవకాశాలు ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మద్దతు ధర 74.70 నుండి 74.50 స్థాయిల్లో ఉంటుందని భావిస్తున్నారు. క్రితం సెషన్లో రూపాయి 74.82 వద్ద క్లోజ్ అయింది.
చమురు ధరల క్షీణత
కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే చమురు ధరలపై ప్రభావం ఉంటుంది. తాజాగా బ్రెంట్ క్రూడాయిల్ 0.6 శాతం క్షీణించి 45.09 డాలర్ల వద్ద, యూఎస్ చమురు 0.7 శాతం పడిపోయి బ్యారెల్ 42.62 డాలర్ల వద్ద ఉంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ పడిపోయింది. దీంతో ఈ రోజు ఈ ధరలు తగ్గాయి. గతవారం యూఎస్ ముడి చమురు నిల్వలు 1.6 మిలియన్ బ్యారెల్స్ పడిపోయినట్లు డేటా చూపింది.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 320 పాయింట్ల వరకు, నిఫ్టీ 87 పాయింట్ల వరకు పతనమైంది. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 280 పాయింట్లు నష్టపోయి 38,334 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పడిపోయి 11,340 వద్ద ట్రేడ్ అయింది. టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు, విప్రో, హెచ్డీఎఫ్సీ, భారతీ ఇన్ప్రాటెల్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.