అదానీలో అప్పుడు రూ.1 పెడితే ఇప్పుడు రూ.800 వచ్చాయి, రెండో స్థానంలోకి భారత్
పాతిక సంవత్సరాల క్రితం 1994లో అదానీ ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు రూ.1 ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ.800 రిటర్న్స్ వచ్చాయి. ఆ సమయంలో వాటాదారులు పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడి 800 రెట్లు పెరిగిందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. జేపీ మోర్గాన్ ఇండియా సమ్మిట్-ఫ్యూచర్ ఇన్ ఫోకస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ మౌలికరంగ దిగ్గజం పలు వ్యాపార వేదికలను అనుసంధానించేదిగా ఎదిగినట్లు తెలిపారు. అదాని గ్రూప్కు చెందిన ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయని, వేలాది ఉద్యోగాలు కల్పించామన్నారు. షేర్ హోల్డర్ల వ్యాల్యూ అసాధారణ స్థాయికి పెంచామన్నారు.
టాటా కార్లపై బంపరాఫర్, రూ.65,000 వరకు తగ్గింపు: ప్రయోజనం ఎవరికి ఎలా అంటే?
ఆరు లిస్టెడ్ కంపెనీలు
అదానీ ఎంటర్ప్రైజెస్ 1994లో ఐపీవోకు వచ్చింది. గౌతమ్ అదానీ కాలేజీ చదువును మధ్యలో ఆపేసి, తొలుత కమోడిటీ ట్రేడింగ్తో తన వ్యాపార ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం అదానీ గ్రూప్తో వివిధ వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇంధనరంగ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద నౌకాశ్రయనిర్వహణదారు. దేశంలో అతిపెద్ద ప్రయివేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా ఎదిగింది. ఇంధనం, మైనింగ్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనశక్తి, రక్షణ, వ్యవసాయ కమోడిటీ వ్యాపారాలు నిర్వహిస్తోంది. తాము ముఖ్యమంగా వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ప్రజలు, సమాచారం.. ఇలా పలు వాటిని చేరవేసే మౌలిస సదుపాయాలను అభివృద్ధి చేశామని, భారత్లో మొలిక సదుపాయాల వృద్ధిలో తమ వంతు సహకారం అందించడంపై దృష్టి పెట్టడమే ధ్యేయమని గౌతమ్ అదానీ అన్నారు.
2050 నాటికి భారత్ రెండో ఎకానమీగా..
2050 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని గౌతమ్ అదానీ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాపార అవకాశాల విషయంలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. 1990లో ప్రపంచ జీడీపీలో 33 లక్షల కోట్ల డాలర్లు ఉండగా, ఇప్పుడు 90 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని, వచ్చే 30 ఏళ్లలో 170 లక్షల కోట్ల డాలర్లకు పెరగనుందన్నారు. ఒక వ్యాపారవేత్తగా తాను ఆశావహంగా ఉంటానని చెప్పారు. తన కళ్ళతో చూస్తే, చాలా అవకాశాలు కనిపిస్తాయన్నారు.
పెట్టుబడులు అవసరం
భారత్ ఎదుట సవాళ్లు ఉన్నాయని గౌతమ్ అదానీ అన్నారు. వచ్చే పదేళ్ల కాలంలో 1.5 లక్షల కోట్ల నుండి 2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమని తెలిపారు. స్వల్పకాలిక ఆలోచనలతో దీర్ఘకాలిక ప్రణాళకలను అమలు చేయలేమని అన్నారు. పాశ్చాత్య వృద్ధి గణాంకాల కోణం నుండి ఇతర దేశాలను చూడటం మానివేయాలన్నారు. ఒక్కో దేశంలో ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారి వ్యవస్థ ఒక్కోలా ఉంటుందన్నారు. భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయన్నారు.