జియో ఎఫెక్ట్: రూ.10 లక్షల కోట్ల కంపెనీగా... ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఘనత
ముంబై: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన తొలి భారత కంపెనీగా గురువారం ఘనత సాధించింది. ఇది భారత బిజినెస్ హిస్టరీలో సరికొత్త రికార్డ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్ గురువారం నాటి ట్రేడింగ్లో ఉదయం 0.69 శాతం పెరిగి రూ.1,579కు చేరుకున్న సమయంలో రూ.10,00,000 కోట్ల మార్కెట్ను దాటింది.
రూ.10,00,000 కోట్ల M-Cap మేజిక్ మార్క్
ఏడాదిలో 41 శాతం పెరుగుదల
RIL షేర్ వ్యాల్యూ ఈ క్యాలెండర్ ఏడాదిలోనే ఏకంగా 41 శాతం వరకు పెరగడం గమనార్హం. 2016లో జియోను లాంచ్ చేసిన తర్వాత దూసుకెళ్తోంది. RILకు అత్యధిక లాభాలు, టెలికం టారిఫ్స్ పెంపు, గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కావడం, తక్కువ మూలధన వ్యయం, రానున్న కొద్ది రోజుల్లో డెబిట్ ఫ్రీ అని ప్రకటించడం వంటి వివిధ అంశాల కారణంగా ఈ షేర్ దూసుకెళ్తోంది.
జియో ఎఫెక్ట్
ముఖ్యంగా జియో టారిఫ్స్ పెంచాలని రిలయన్స్ నిర్ణయించడం షేర్కు మరింత కలిసి వచ్చిందని అంటున్నారు. 2016 నుంచి జియో యూజర్లు పెరుగుతున్నారు. డేటా, వాయిస్ కాల్స్ అతి చౌకకు ఇచ్చింది. ఇటీవలే IUC ఛార్జీలు ప్రారంభించింది. అలాగే, డిసెంబర్ నుంచి టారిఫ్ పెంచనుంది. ఎస్బీఐ క్యాప్స్ కూడా జియో టారిఫ్స్ పెంపుపై సానుకూలంగా స్పందించింది. మధ్యాహ్నం సమయానికి రిలయన్స్ షేర్ వ్యాల్యూ 1,576.55గా ఉంది.
వేగంగా పుంజుకున్న షేర్...
ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ నాటికి RIL మార్కెట్ వ్యాల్యూ రూ.9 లక్షల కోట్లు చేరుకుంది. గత ఏడాది ఆగస్ట్ నెలలో రూ.8 లక్షల కోట్ల మార్క్ దాటింది. నాటి నుంచి షేర్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. గత వారం రూ.9.5 లక్షల మార్క్ దాటింది. రూ.10 లక్షల కోట్లకు చేరువైంది. ఈ రోజు (నవంబర్ 28) రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను దాటింది. రిలయన్స్ తర్వాత టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. టీసీఎస్ మార్కెట్ వ్యాల్యూ రూ.7.81 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ కంటే రూ.2 లక్షల కోట్లకు పైగా వ్యత్యాసం ఉంది.