రిలయన్స్ లాభాలకు చమురు దెబ్బ, ఆదుకున్న జియో: రూ.53,125 కోట్ల మెగా రైట్స్ ఇష్యూ
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ క్వార్టర్ 4 ఫలితాలను ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా చమురు ధరలు పాతాళానికి పడిపోవడంతో నిరాశజనక లాభాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి జనవరి-మార్చి క్వార్టర్లో రూ.6,348 కోట్ల లాభాలకే పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్తో పోలిస్తే 39 శాతం క్షీణత నమోదు చేసింది. గత మూడేళ్లలో ఇదే అత్యంత కనిష్ఠ త్రైమాసిక లాభాలు.
కరోనా ఎఫెక్ట్: రిలయన్స్లో వేతనాల కోత, ఏడాది జీతం వదులుకున్న ముఖేష్ అంబానీ
భారీగా తగ్గిన లాభాలు
జనవరి - మార్చి క్వార్టర్కు రిలయన్స్ రూ.10,500 కోట్ల నికర లాభాన్ని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఇది రూ.6,348 కోట్లకే పరిమితమైంది. గత ఏడాది ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.10,362 కోట్లు ఆర్జించింది. దీంతో పోలిస్తే 39 శాతం తగ్గుదల నమోదు చేసింది.
జియో హిట్
రిలయన్స్ సాధించిన లాభాల్లో జియో పాత్రనే ఎక్కువగా ఉంది. జియో నికర లాభం ఈ జనవరి-మార్చి క్వార్టర్లో అంతకుముందు ఏడాది అదే క్వార్టర్తో పోలిస్తే 177% ఎగిసింది. జియో లాభం రూ.2,331 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ రూ.840 కోట్ల లాభాలు నమోదు చేసింది. చార్జీల పెంపు, పెరిగిన కస్టమర్ల కారణంగా లాభాలు పెరిగాయి.
పడకేసిన చమురు
చమురు ధరలు గత మూడు నెలలుగా భారీగా పడిపోతున్నాయి. దీంతో రూ.4,267 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. లాభాలపై ఇది ప్రధానంగా ప్రభావం చూపింది. ఈ నష్టాన్ని మినహాయిస్తే రిలయన్స్ లాభం 3.7 శాతం పెరిగి రూ.10,813 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో తగ్గడం రెండోసారి. మొదటి క్వార్టర్లోను తగ్గింది.
మెగా రైట్స్
రూ.53,125 కోట్ల మెగా రైట్స్ ఇష్యూను రిలయన్స్ ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 65 శాతం (రూ.6.50) డివిడెండ్ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. రూ.53,125 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఈ ఇష్యూ కింద వాటాదారులకు ప్రతి 15 షేర్లకు ఒక్కో షేరును రూ.1,257 ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం రిలయన్స్ షేర్ రూ.1,467గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఇష్యూగా చెబుతున్నారు.
ఆరామ్కోకు విక్రయానికి విడదీత
జూన్ నాటికి రూ.1.04 కోట్ల నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. 75 బిలియన్ డాలర్ల విలువైన చమురు - రసాయనాల విభాగాన్ని విడదీసి ప్రత్యేక విభంగాగా ఉంచేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్కోకు వికర్యించేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.