రుణరహిత సంస్థ దిశగా రిలయన్స్: 30 ఏళ్లలో తొలిసారి ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని రుణరహితంగా మార్చాలని భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వ్యూహాత్మక ఒప్పందాలు, సేల్స్కు తెరలేపిన ముఖేష్ అంబానీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరో కీలక నిర్ణయం దిశగా అడుగు వేసింది. రైట్ ఇష్యూకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 30వ తేదీన (రేపు) జరగబోయే డైరెక్టర్ల సమావేశంలో ఈ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది.
ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో గుడ్న్యూస్: వారికి చేదు, ఈ 3 నష్టాలు
రైట్స్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లు జారీ చేసే యోచన
మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఫలితాల పరిశీలన, ఆమోదం కోసం రేపు డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుంది. ఈ సమావేశంలో తుది డివిడెండ్ను బోర్డు సిఫార్స్ చేస్తుంది. అలాగే నిర్దేశిత నియంత్రణ సంస్థల అనుమతులు, చట్టాలకు లోబడి ప్రస్తుత వాటాదారులకు రైట్స్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లను జారీ చేసే ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డు పరిశీలిస్తోంది. ఈ మేరకు ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
30 ఏళ్ల తర్వాత
రైట్స్ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి. రిలయన్స్ 1991లో నిధుల సమీకరణ కోసం వెళ్లింది. ఆ సమయంలో ఒక్కోటి రూ.55 విలువైన ఈక్విటీ షేర్లుగా మార్చుకునే డిబెంచర్లను జారీ చేసింది. ఇప్పుడు మరోసారి రైట్ ఇష్యూకు వెళ్తోంది. 2021 మార్చి వరకు రిలయన్స్ను రుణరహిత సంస్థగా మార్చుతామని గత ఏడాది ఆగస్ట్లో ముఖేష్ అంబానీ ప్రకటించారు.
5 శాతం వాటా తగ్గొచ్చు
రైట్స్ ఇష్యూ ద్వారా కనీసం రిలయన్స్ కనీసం 5 శాతం వాటాను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. కంపెనీలు సాధారణంగా ఆర్థిక భారాల నుండి గట్టెక్కేందుకు అవసరమైన అదనపు నిధుల కోసం రైట్స్ ఇష్యూను ప్రకటిస్తాయి. గత కొద్ది వారాల్లో రిలయన్స్ ఫండ్ రైజింగ్ చేయడం ఇది మూడోసారి. రిలయన్స్ - ఫేస్బుక్ డీల్ ద్వారా రూ.43వేల కోట్లకు పైగా నిధులు సమీకరించారు. అంతకుముందు బీపీ, సౌదీ ఆరామ్కోతో ద్వారా నిధుల సేకరణకు మొగ్గు చూపింది రిలయన్స్. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా దాదాపు రూ.25 వేల కోట్ల మేర నిధులు సమీకరించనున్నట్టు ఇటీవల తెలిపింది.
రుణభారం ఇలా తగ్గుదల
రైట్స్ ఇష్యూ ద్వారా కనీసం 5 శాతం వాటా షేర్లను రిలయన్స్ జారీ చేయవచ్చునని భావిస్తున్నారు. అప్పుడు ప్రతి వంద షేర్లకు 5 కొత్త షేర్లు లభిస్తాయి. ఈ రైట్స్ ఇష్యూ ద్వారా 40,000 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. గత ఏడాది డిసెంబర్ నాటికి రిలయన్స్ రుణభారం రూ.3,06,851 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,53,719 కోట్లు ఉన్నాయి. మొత్తంగా నికర రుణ భారం రూ.1,53,132 కోట్లు. ఫేస్బుక్కు జియో వాటా (రూ.43,574 కోట్లు, రిటైల్ విభాగంలో సగం వాటాను బీపీకి (రూ.7,000 కోట్లు), టెలికం టవర్ బిజినెస్ను రూ.25,200 కోట్లకు విక్రయించింది. సౌదీఆరామ్కో కంపెనీకి ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో 20 శాతం వాటా విక్రయించడం ద్వారా రుణభారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ముఖేష్ అడుగులు మార్చి 2021 నాటికి రిలయన్స్ను రుణరహిత కంపెనీగా నిలబెడుతుందని భావిస్తున్నారు.