పీఎం-కేర్కు రిలయన్స్ రూ.500 కోట్ల భారీ ఆర్థిక సాయం, మరెన్నో సేవలు
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన పోరాడానికి మద్దతివ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పీఎం కేర్స్ ఫండ్కు రూ.500 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి అదనంగా కరోనాపై మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆ రెండు రాష్ట్రాలకు రూ.5 కోట్ల చొప్పున విరాళాన్ని అందించింది. కరోనాపై పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 24X7 బహుముఖ, క్షేత్రస్థాయి ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. ప్రజలు సన్నద్ధంగా ఉండేందుకు ఆహార సరఫరా పొందేందుకు, సురక్షితంగా, అనుసంధానితమై ఉండేలా స్ఫూర్తిని అందించేలా చేస్తోందని తెలిపింది.
కరోనా మహమ్మారిపై పోరుకు ఇప్పటికే రిలయన్స్ కుటుంబం తన శక్తిసామర్థ్యాలు వినియోగిస్తోందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ బృందాలు నగరాలు, గ్రామాలకు చేరుకున్నాయని, ఆసుపత్రులు, కిరాణా స్టోర్స్, రిటైల్ స్టోర్లలో సేవలు అందిస్తున్నాయని తెలిపింది. దేశసేవలో తమ కంపెనీ అదనపు శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తోందని పేర్కొంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సాయం చేశాయిలా..
- PM-CARES Fundకు రూ.500 కోట్లు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి రూ.5 కోట్లు
- గుజరాత్ ముఖ్యమంత్రి నిధికి రూ.5 కోట్లు.
- భారతదేశంలో మొట్టమొదటి 100 బెడ్స్ ఎక్స్క్లూజివ్ కోవిడ్ హాస్పిటల్ను వేగంగా నిర్మిస్తోంది. మరో రెండు వారాల్లో ఈ హాస్పిటల్లో కోవిడ్19 రోగులకు సేవలు అందిస్తుంది.
- దేశవ్యాప్తంగా రానున్న 10 రోజుల్లో 50 లక్షల మందికి ఉచిత భోజనాలు, కొత్త ప్రాంతాల్లో మరిన్ని మీల్స్ అందించే ప్రయత్నాలు.
- పారిశుద్ధ్య కార్మికులు, సంరక్షకులకు రోజుకు 1 లక్ష మాస్కుల పంపిణీ.
- ఆరోగ్య సిబ్బందికి, సంరక్షకులకు రోజు వేలాది పీపీఈలు.
- ప్రకటించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు ఉచిత ఇంధనం.
- 40 కోట్ల మంది వ్యక్తులను, వేలాది సంస్థలను జియో తిరుగులేని విధంగా అనుసంధానం చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్, హెల్త్ ఫ్రమ్ హోమ్ వంటి కార్యక్రమాలకు అండగా నిలిచింది. దేశం ముందుకు వెళ్లేందుకు తోడ్పడుతోంది.
- స్టోర్స్, హోమ్ డెలివరీస్ ద్వారా రిలయన్స్ రిటైల్ రోజుకు కోట్లాదిమంది భారతీయులకు నిత్యావసర వస్తువులు అందిస్తోంది.
- సమయానుగుణంగా తగినంత ఆర్థిక విరాళం అందించడంతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా దేశం పట్ల తన అంకితభావాన్ని చాటుకుంటోంది.
- కంపెనీ, సిబ్బంది రోజు దేశ సేవలో నిమగ్నమయ్యారు.
- కరోనా నుండి కాపాడటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, సంరక్షకులు, అధికారులు, పోలీసులకు రవాణా మరియు నిత్యావసర వస్తువులను అందించే వారికి సహకరిస్తున్నారు.
- అలాగే ఇళ్లలోనే ఉంటూ కరోనా పోరాటానికి మద్దతుగా ఉంటున్న కోట్లాది మంది భారతీయులకు అండగా నిలుస్తున్నారు.
- వైరస్ పైన జరుగుతున్న పోరాటంలో మొదటి వరుసలో నిలిచిన వైద్యులు లాంటి వారికి అండగా, రెండో వరుసలో రిలయన్స్ సిబ్బంది తన సేవలు అందిస్తున్నారని తెలిపింది.
- ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. భారత్ త్వరలో కరోనాపై విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. నీతా అంబానీ మాట్లాడుతూ.. కోవిడ్19 మహమ్మారిపై పోరాడేందుకు దేశమంతా ఒక్కటైన సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందన్నారు.


Click it and Unblock the Notifications